KTR Delhi Tour: మెట్రో రెండో దశ పనులకు కేంద్రం సాయం కోరిన కేటీఆర్
ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై తెలంగాణకు అందాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నారు
- Author : Vamsi Chowdary Korata
Date : 24-06-2023 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
KTR Delhi Tour: ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై తెలంగాణకు అందాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. ఇక తాజాగా కేటీఆర్ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ ని కలిశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విషయంలో చొరవ చూపాలని హర్దీప్ సింగ్ ని కోరారు. ఈ నేపథ్యంలో నగరంలోని రెండవ దశ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా లక్డికాపూల్ నుంచి బిహెచ్ఇఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్ల మెట్రోకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని కోరారు మంత్రి కేటీఆర్. అంతేకాకుండా రోడ్ల విస్తరణపై కేంద్రానికి వివరించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు 2400 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటె తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు హర్దీప్ సింగ్. శానిటేషన్ హబ్ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.
Read More: Peoples March : ట్విట్టర్ ట్రెండింగ్లో పీపుల్స్ మార్చ్