సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక సూచనలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 05-01-2026 - 1:16 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad Police Commissioner V.C. Sajjanar సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారికి కీలక సూచనలు చేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రయాణానికి ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తద్వారా పెట్రోలింగ్లో భాగంగా పోలీసు సిబ్బంది ఇళ్లపై నిఘా ఉంచుతారని తెలిపారు. అంతేకాకుండా నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో వంటి సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు.
- సంక్రాంతికి సొంతూరు వెళ్లే వారికి సజ్జనార్ అలర్ట్
- ఈ విషయాలు అస్సలు మర్చిపోకండి!
- డబ్బు, నగలు జాగ్రత్త
తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. పండగ పూట ఇంటికి వెళ్లాలని, సొంతూళ్లలో సంతోషంగా గడపాలని అందరూ భావిస్తారు. అందుకే విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన వారు కూడా సంక్రాంతికి సొంతూరుకి వెళ్లాలనుకుంటారు. అయితే ఇదే అదనుగా భావించి దొంగలు చెలరేగిపోతారు. ఖాళీగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి.. దోపిడీలకు పాల్పడతారు. ఇక రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ము దొంగల పాలు అయ్యేసరికి లబోదిబోమంటారు.. ఇంటి యజమానులు. అయితే అంతా అయిపోయాక పోలీసులకు ఫిర్యాదు చేయడం కంటే.. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. ఈ సందర్భంగా సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేవారికి పలు సూచనలు ఇచ్చారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారికి.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. సొంతూళ్లకు వెళ్లే ముందు ఇంటి యజమానులు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో నగర వాసులను అలర్ట్ చేశారు సీపీ సజ్జనార్. ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్ స్టేషన్లో గానీ, బీట్ ఆఫీసర్కు గానీ సమాచారం అందిస్తే.. పెట్రోలింగ్లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా దొంగలపై ఓ కన్ను వేయొచ్చు. సమాచారం ఇచ్చిన ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే.. పోలీసులు ఆలోచించకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
నగదు, బంగారం జాగ్రత్త..
కాగా, పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఉంచకూదని సీపీ సజ్జనార్ చెప్పారు. అలాంటి విలువైన వస్తువులును బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలి సూచించారు. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే.. చోరీలు జరగకుండా, నష్టపోకుండా నివారించవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా ఇంటి భద్రతపై దృష్టి పెట్టకుండా.. పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని సీపీ సజ్జనార్ అన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు చేస్తున్న కృషిని కూడా సజ్జనార్ వివరించారు. ఆధునిక పోలీసింగ్ అంటే కేవలం నేరాలు జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదని.. అవి జరగకుండా ముందుగానే నివారించడం కూడా అని ఎక్స్లో పేర్కొన్నారు. పండుగ సీజన్లో శాంతిభద్రతల పరిరక్షణకు, మీ ఇళ్ల భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే దాని కోసం ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పారు. అత్యవసర సమయంలో వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు.