Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు
- Author : Vamsi Chowdary Korata
Date : 23-03-2026 - 1:03 IST
Published By : Hashtagu Telugu Desk
Danam Nagender బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. గతంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దానం నాగేందర్ పార్టీ మారలేదని ఇచ్చిన తీర్పును ఆయన తన పిటిషన్లో సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘బి-ఫామ్’పై పోటీ చేశారని, ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని మహేశ్వర్ రెడ్డి వాదించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పును రద్దు చేసి, దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును అభ్యర్థించారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రతివాదులుగా ఉన్న దానం నాగేందర్తో పాటు అసెంబ్లీ స్పీకర్కు కూడా నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా దానం నాగేందర్, స్పీకర్ తమ వివరణలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా ఉంది.