Telangana Government: తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. రాష్ట్రంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఫ్రీ హెల్త్ చెకప్
- Author : Vamsi Chowdary Korata
Date : 21-07-2026 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (NEHS) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా 40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఏటా ఒకసారి ఉచితంగా సమగ్ర ‘మాస్టర్ హెల్త్ చెకప్’ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ హెల్త్ కార్డ్ విధానాన్ని రూపొందించారు. లబ్ధిదారులకు క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత డిజిటల్ హెల్త్ కార్డులను అందుబాటులోకి తేగా, వెబ్పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా వీటిని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఉమ్మడి భాగస్వామ్యంతో నిధిప్రస్తుత పాత పథకంలో అవుట్పేషెంట్ (OP) సేవలు అందుబాటులో లేకపోగా, కొత్త పథకంలో ఎంపానెల్ అయిన ఆసుపత్రుల్లో ఓపీడీ కన్సల్టేషన్ మరియు ల్యాబ్ పరీక్షలపై 50 శాతం రాయితీ కల్పించడం విశేషం. అంతేకాకుండా నాన్-ప్యాకేజీ చికిత్సల పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ పథకం నిర్వహణ కోసం ఉద్యోగి లేదా పెన్షనర్ తమ మూల వేతనంలో (Basic Pay / Pension) 1.5 శాతం చందాను చెల్లించాల్సి ఉండగా, అంతే సమానమైన (1.5%) మొత్తాన్ని ప్రభుత్వం కూడా జత చేసి ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) నిధికి జమ చేస్తుంది. సుమారు 943కి పైగా నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా 17.88 లక్షల మంది లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి రానుంది.