తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
- Author : Vamsi Chowdary Korata
Date : 14-03-2026 - 10:53 IST
Published By : Hashtagu Telugu Desk
Telugu States IRCTC Special Trains తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు. ప్రత్యేక సర్వీసులుగా నడుస్తున్న మూడు రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్గా మార్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. హైదరాబాద్-కన్యాకుమారి, చర్లపల్లి-షాలిమార్, కాచిగూడ-ట్యూటికోరిన్ మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రెగ్యులర్ ట్రైన్లుగా మార్చడం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అదనపు ఛార్జీలూ ఉండవని అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2014 నుంచి హైదరాబాద్ రైల్వే స్టేషన్ల కేంద్రంగా భారతీయ రైల్వే 91 కొత్త ట్రైన్ సర్వీసులను ప్రారంభించిందని తెలిపారు. రూ.36,286 కోట్ల రైల్వే బడ్జెట్ను కేటాయించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.47,984 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రానికే మూడు హైస్పీడ్ ట్రైన్ కారిడార్లను మంజూరు చేశారని వివరించారు.
హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ప్రత్యేక ట్రైన్ను హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్ప్రెస్గా మార్చారు. గతంలోలాగే ఈ ట్రైన్ ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుందని చెప్పారు. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
కాచిగూడ-మదురై-కాచిగూడ ప్రత్యేక ట్రైన్ను కాచిగూడ-ట్యూటికోరిన్-కాచిగూడ ఎక్స్ప్రెస్గా మార్చేశారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం మూడింటికి కాచిగూడ రైల్వే స్టేషన్లో మొదలై మరుసటి రోజు రాత్రి 10.45 గంటలకు కేరళలోని ట్యూటికోరిన్కు చేరుకుంటుంది. షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి ప్రత్యేక ట్రైన్ను చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 11.20 గంటలకు పశ్చిమబెంగాల్లోని షాలిమార్కు చేరుకుంటుందని చెప్పారు. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్ ప్రయాణం సాగిస్తుంది.