CM Revanth : నవమి వేళ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపడం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు ఎంతో ఊరటనిచ్చింది.
- Author : Sudheer
Date : 06-04-2025 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీరామనవమి (Sriramanavami) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సీతారామ ఎత్తిపోతల పథకానికి (Sitarama Lift Irrigation Scheme) సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపడం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి కొత్త దిక్సూచి ఏర్పడనుందని మంత్రి పేర్కొన్నారు.
ఆధునికీకరణతో ప్రాజెక్టు వ్యయం పెంపు
సీతారామ ఎత్తిపోతల పథకం 2016లో ప్రారంభమై ప్రారంభ అంచనాలు రూ.7,926 కోట్లు కాగా, 2018లో అంచనాలను రూ.13,057 కోట్లకు పెంచారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు విస్తరణ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం తాజా అంచనాలను రూ.19,324.92 కోట్లకు పెంచింది. ఇప్పటివరకు ఇప్పటికే రూ.10,000 కోట్లకు పైగా ఈ ప్రాజెక్టుపై ఖర్చయినట్లు అధికారులు తెలిపారు. సీతారామ పథకం ద్వారా మొత్తం 4,15,621 ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంకొన్ని 3,89,366 ఎకరాలను సాగు పరిధిలోకి తీసుకురావడమే మరో ముఖ్యమైన లక్ష్యం. ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాల రైతులకు సాగునీటి సమస్యల నుండి విముక్తి లభించనుంది.
రైతులకు మాత్రమే కాకుండా విద్యార్థులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మైనింగ్ కాలేజీని “ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ”గా అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ యూనివర్సిటీ ద్వారా భూగర్భ వనరులు, భూవిజ్ఞానం, పర్యావరణ శాస్త్రాలపై ప్రాధాన్యత కలిగిన విద్యా, పరిశోధనా అవకాశాలు ఏర్పడనున్నాయి. ఇది ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడడమే కాకుండా, విద్యార్థులకు నూతన అవకాశం ద్వారాలు తెరిచే వినూత్నమైన ఆలోచనగా అభినందనలు పొందుతోంది.