Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!
ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Car Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న పలు లోటుపాట్లను అందులో బయటపెట్టారు.
- By Pasha Published Date - 02:58 PM, Sat - 18 January 25

Formula E Car Race Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణం జరిగింది. ఈ కేసుతో ముడిపడిన ఆర్థిక అవకతవకల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ ప్రచురించిన కథనంలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Car Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న పలు లోటుపాట్లను అందులో బయటపెట్టారు. సీజన్ 10 కార్ రేసును నిర్వహించేందుకు లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్’ (ఎఫ్ఈఓ) కంపెనీతో నాడు తెలంగాణ సర్కారు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఒప్పందంపై సంతకాలు జరగడానికి ముందే ఎఫ్ఈఓ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి పెద్దమొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు ఆ కథనంలో ప్రస్తావించారు. దీనికి ఆధారంగా నిలిచే కొన్ని డాక్యుమెంట్లు తమకు లభించాయని పేర్కొనడం గమనార్హం. సీజన్ 10 కారు రేసుకు సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీకి రెండు ఇన్స్టాల్మెంట్లలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రూ.45 కోట్లను చెల్లించింది. 2023 సంవత్సరం అక్టోబరు 5, 11 తేదీల్లో ఈ చెల్లింపులు జరిగాయి. అయితే రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీతో తెలంగాణ సర్కారు, హెచ్ఎండీఏ అక్టోబరు 30న ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Also Read :Free Electricity And Water : అద్దె ఇళ్లలో ఉండేవారికి ఉచితంగా విద్యుత్, నీరు.. ఆప్ సంచలన హామీలు
దాదాపు రూ.90 కోట్లను..
ఇక అంతకుముందు సీజన్ 9కు చెందిన ఫార్ములా ఈ కార్ రేసుకు ప్రమోటర్గా ఏస్ నెక్ట్స్ జెన్ (Ace Nxt Gen) కంపెనీ వ్యవహరించింది. రేసు నిర్వహణకు సంబంధించి తెలంగాణ సర్కారు, హెచ్ఎండీఏలతో ఈ కంపెనీ కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఈ కంపెనీయే ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్’ (ఎఫ్ఈఓ) కంపెనీకి దాదాపు రూ.90 కోట్లను చెల్లించాల్సి ఉంది. అయితే ఈ కంపెనీ ఆ చెల్లింపులు చేయకుండా చేతులు ఎత్తేసిందని కథనంలో ప్రస్తావించారు. నాడు బీఆర్ఎస్ సర్కారు సహకారం లభించినందు వల్లే ఇంత భారీ మొత్తాన్ని చెల్లించకున్నా .. ఏస్ నెక్ట్స్ జెన్ (Ace Nxt Gen) కంపెనీపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
Also Read :Golden Baba : 6 కేజీల బంగారు ఆభరణాలతో గోల్డెన్ బాబా.. మహాకుంభ మేళాలో సందడి
ఏస్ నెక్ట్స్ జెన్ చేతులు ఎత్తేయగానే..
రూ.90 కోట్లను ఎఫ్ఈఓ కంపెనీకి చెల్లించే విషయంలో ఏస్ నెక్ట్స్ జెన్ చేతులు ఎత్తేయగానే.. నాటి బీఆర్ఎస్ సర్కారు రంగంలోకి దిగి కనీసం ఒప్పందంపై సంతకాలు జరగకముందే డబ్బులను ఎఫ్ఈఓకు బదిలీ చేసింది. ఏస్ నెక్ట్స్ జెన్కు లబ్ధి చేకూర్చేందుకే ఈ అత్యుత్సాహాన్ని నాటి బీఆర్ఎస్ సర్కారు ప్రదర్శించిందని కథనంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు లోతుగా దర్యాప్తు చేయిస్తోంది. ఈక్రమంలోనే ఇటీవలే విజయవాడ, హైదరాబాద్లలోని ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ కార్యాలయాల్లో ఏసీబీ ముమ్మర సోదాలు చేసింది. ఈ చెల్లింపులు, ఒప్పందాలతో ముడిపడిన కీలక డాక్యుమెంట్లను సేకరించింది. ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అందిన విరాళాల అంశంపైనా దర్యాప్తు చేస్తున్నారు.