Food Poisoning : మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్..
Food Poisoning : రాష్ట్రంలో వరుసగా ఫుడ్పాయిజన్ ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల పనితీరు బయటపెడుతున్నాయి
- Author : Sudheer
Date : 26-11-2024 - 8:53 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లోని ప్రభుత్వ హాస్టల్స్ లలో వరుసగా ఫుడ్పాయిజన్ (Food Poisoning) ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నటి నిన్న శైలజ అనే స్టూడెంట్ ఫుడ్పాయిజన్ వల్ల మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చర్చ నడుస్తుండగానే..రాష్ట్రంలో వరుసగా ఫుడ్పాయిజన్ ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల పనితీరు బయటపెడుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (Maganur Govt School) మరోసారి ఫుడ్పాయిజన్ జరిగింది.
మంగళవారం నాడు మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం ఈ వారంలో ఇది మూడోసారి. ఇలా వరుసగా ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోకపోవడం పై ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్ జరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు (Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు. ఫుడ్పాయిజన్ జరిగి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై పది రోజులు కూడా గడవకముందే మళ్లీ ఫుడ్పాయిజన్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని అన్నారు. మాటలే తప్ప చేతలు లేని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వాలని.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఉరఫ్ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అసమర్ధత కారణంగా తన సొంత జిల్లాలోని మక్తల్ మండలం మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగిందని దాసోజు శ్రవణ్ అన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల మరణించారని దాసోజు శ్రవణ్ తెలిపారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారని అన్నారు. ఈ పాపం ఎవరిదీ అని ప్రశ్నించారు. ప్రత్యేక విద్యా శాఖ మంత్రి, పూర్తి బాధ్యతలతో ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించకుండా రేవంత్ రెడ్డి నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారని.. ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్లో బిజీగా ఉన్నారని.. ఈ ఘటనలపై కనీస రివ్యూ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ https://t.co/uS3KEI2Wvw pic.twitter.com/6AQJh9frD5
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2024
Read Also : Pushpa Last Shoot : పుష్ప ముగిసింది…పుష్పరాజ్ ట్వీట్