నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత
- Author : Vamsi Chowdary Korata
Date : 03-03-2026 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
Shivaji Raja సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం మధురానగర్లోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వయోభారం కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి మృతితో శివాజీ రాజా కుటుంబం శోకసంద్రంలో మునిగింది. 1962లో భీమవరంలో జన్మించిన శివాజీ రాజా, 1985లో ‘కళ్ళు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 400కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
- నటుడు శివాజీరాజా కుటుంబంలో విషాదం
- ఆయన తండ్రి రామరాజు కన్నుమూత
- కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న రామరాజు
సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధురానగర్లోని స్వగృహంలో ఉదయం 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. వయోభారం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కన్నుమూసినట్లు వెల్లడించారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటల లోపు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
శివాజీరాజా … 1962 , ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో రామరాజు – చంద్రావతి దంపతులకు జన్మించారు. తండ్రి రామరాజు భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజీలో అటెండర్గా పనిచేశారు. హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసిన శివాజీ రాజా తర్వాత నటనపై ఆసక్తితో శిక్షణ తీసుకుని ఆ తర్వాత కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లి సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1985లో విడుదలైన ‘కళ్ళు’ చిత్రంతో ఆయన తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా శివాజీ రాజాకు మంచి గుర్తింపు లభించింది. ఇదే సినిమాకు ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. అనంతరం హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కొన్ని సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో శివాజీ రాజా 400కు పైగా సినిమాలు, అనేక టీవీ సీరియల్స్లో నటించారు. ‘పెళ్లిసందడి’, ‘సిసింద్రీ’, ‘ఘటోత్కచుడు’, ‘మురారి’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు గుర్తుండిపోయేలా నిలిచాయి. టెలివిజన్ రంగంలో ‘అమృతం’ సీరియల్లో ఆయన పోషించిన పాత్ర విశేష ప్రజాదరణ పొందింది. అలాగే ‘సంబరాల రాంబాబు’ వంటి కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘మెగుడ్స్ పెళ్లామ్స్’ సినిమా ద్వారా హీరోగానూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా పరిశ్రమకు సేవలందిస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగానూ శివాజీ రాజా బాధ్యతలు నిర్వహించారు. తన ప్రత్యేక హాస్యశైలి, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన శివాజీ రాజ కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.