Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!
- By Vamsi Chowdary Korata Published Date - 02:17 PM, Fri - 17 October 25

సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్
ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బందులో యావత్ ప్రజానీకం, సకల వర్గాలు పాల్గొనాలి
ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బిజెపి నాయకులు సమయం తీసుకోండి
సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం
సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈనెల 23న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం
మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Deputy CM Bhatti Vikramarka Mallu
సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా 400 కోట్ల రూపాయల బోనస్ ప్రకటిస్తున్నాం దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు పయనిస్తూ చెడుపై మంచి విజయం సాధించాలని కోరుకుంటూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కట్టుబడి ఉంది. 100 సంవత్సరాల పైబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ సర్వే నిర్వహించాం. సర్వే వివరాలు తో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపాము. గత టిఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో స్థానిక ఎన్నికల సమయంలో స్థానిక సంస్థలలో 50% పెంచకుండా క్యాబ్ విధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ఆ చట్టాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాం. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపాము అని డిప్యూటీ సీఎం అన్నారు. బీసీ రిజర్వేషన్ ల పై క్యాబినెట్ తీర్మానం చేసాం, సర్వే నిర్వహించాం, డేడికేషన్ కమిషన్ను నియమించాం, అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపాం ఇలా అన్ని దశల్లో అవసరమైన చర్యలు చేపడితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొన్ని నెలలుగా బీసీ చట్టం అమల్లోకి రాకుండా అడ్డుకుంటుంది అని ఆరోపించారు.

Deputy CM Bhatti Vikramarka Mallu
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రమే బిజెపి నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసింది అన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసిన కేంద్ర నుంచి అనుమతి ఇవ్వలేదు అని డిప్యూటీ సీఎం వివరించారు. బీసీలకు ఇచ్చిన హామీని తూచా తప్పక పాటించేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టి అన్ని పార్టీలను ఆహ్వానించగా దేశంలోని ఇతర పార్టీలన్నీ మద్దతు తెలియజేయగా కేవలం బిజెపి ఎందుకు అడ్డుపడుతుందని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసును గెలిచేందుకు దేశంలో అనుభవిజ్ఞులైన అభిషేక్ మను సింగ్వి, రవి వర్మ వంటి న్యాయ కోవిదులను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి కొట్లాడిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు అన్నారు.
ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని డిప్యూటీ సీఎం సీఎం తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర బిజెపి విభాగం అధ్యక్షుడు రామచంద్ర రావులు ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం సమయం తీసుకోండి, నాయకత్వం వహించండి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బిజెపి నాయకత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. మేము అడిగితే కేంద్ర పెద్దలు సమయం ఇవ్వడం లేదు అని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి తో ఉందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు కాఫీ రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈనెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటాం అని వివరించారు.