Cyclone Michaung: భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
మైచాంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
- Author : Vamsi Chowdary Korata
Date : 05-12-2023 - 5:53 IST
Published By : Hashtagu Telugu Desk
Cyclone Michaung: మైచాంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపనున్నారు. ఇప్పటికే నిండుకుండలా ఉన్న జలాశయాలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు కలెక్టర్లను కోరారు.లోతట్టు ప్రాంతాలలో నీరు భారీగా ప్రవహించే అవకాశం ఉన్నందున తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని కోరారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల, విపత్తు నిర్వహణ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.తెలంగాణలోని ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డిసెంబరు 5వ తేదీ ,డిసెంబర్ 6వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.అదే సమయంలో సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ సహా వివిధ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read: V C Sajjanar: డిజిటలైజేషన్ దిశగా టీఎస్ఆర్టీసీ