CM Revanth: మాగనూరు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు!
నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Author : Gopi
Date : 20-11-2024 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth: తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను అందించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు.
Also Read: Asian Champions Trophy: చైనాకు షాక్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీగా భారత్ జట్టు!
ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇకపోతే ఇప్పటికే తెలంగాణలోని అనేక పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలు రకాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం దక్కటం లేదు. రోజు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేసి అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి వస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో గుడ్డు ఆధారిత మయోనెస్ను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.