SLBC Tunnel : మరికాసేపట్లో SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
SLBC Tunnel : ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత సీఎం స్పందించడం ఆలస్యమని, ప్రభుత్వం సమయానుసారం చర్యలు తీసుకుంటే కార్మికులను రక్షించవచ్చునని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి
- Author : Sudheer
Date : 02-03-2025 - 1:39 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం (SLBC Tunnel Accident ) రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తొమ్మిది రోజులుగా సాగుతున్న సహాయక చర్యల తర్వాత, అక్కడ చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులు మరణించారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. టన్నెల్ కూలిన సమయంలో అక్కడే ఉన్న మట్టి, బురద కింద కార్మికుల మృతదేహాలను గుర్తించామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishnarao) తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy To Visit SLBC Tunnel ) ఈరోజు సాయంత్రం 5 గంటలకు టన్నెల్ వద్దకు వెళ్లి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించనున్నారు. అయితే ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత సీఎం స్పందించడం ఆలస్యమని, ప్రభుత్వం సమయానుసారం చర్యలు తీసుకుంటే కార్మికులను రక్షించవచ్చునని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Property : నీ రక్తం తాగుతా అంటూ ఆస్తి కోసం తల్లిని హింసించిన కూతురు
ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సహా అనేక రెస్క్యూ టీములు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించి ఉంటే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని విమర్శకులు అంటున్నారు. కానీ ఈ కష్ట సమయంలో కూడా సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటాన్ని బిఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది. కార్మికుల ప్రాణాలను గాలికొదిలేసి, రాజకీయ కార్యక్రమాల్లోనే నిమగ్నమయ్యారని ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఇప్పుడు సీఎం స్వయంగా ఘటన స్థలాన్ని సందర్శించడం, సహాయక చర్యలను పర్యవేక్షించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
Chicken Shops : ఊపిరి పీల్చుకున్న చికెన్ షాప్ యజమానులు
ఇప్పటికే విపక్షాలు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే, ప్రభుత్వం ఆలస్యంగా స్పందించడంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా టన్నెల్ వద్ద సహాయక చర్యలు మొదలై పదిరోజులు అవుతున్నప్పటికీ, సీఎం ఇప్పటివరకు అక్కడికి వెళ్లకపోవడాన్ని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తగినంత చొరవ చూపడం లేదని, ఎన్నికల రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.