Telangana Assembly polls: తెలంగాణా ఎన్నికలపై ఈసీ దూకుడు
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2023 - 9:04 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Assembly polls: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకునే బాధ్యతను సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ రోజు ఎన్నికలపై సీనియర్ నాయకుల బృందం సమీక్ష నిర్వహించింది.
తెలంగాణాలో రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధం వాతావరణం తలపిస్తుంది. అధికారం కోసం ఎత్తులు పై ఎత్తులు వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణాలో ఒక్కసారైనా జెండా పాతాలని బీజేపీ యోచిస్తుంది. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కూడా హైదరాబాద్ నుండి పాలన చేసే దిశగా ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ ఇప్పటికే పాతుకుపోయింది. సీఎం కెసిఆర్ నాయకత్వంలో పార్టీ పునాదులు మరింత స్ట్రాంగ్ అయ్యాయి. దీంతో తెలంగాణాలో వచ్చే ఎన్నికలు కీలకం కానున్నాయి. మద్యం, డబ్బు ఏరులైపారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఓటర్ల విషయంలో మూడు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఒక్క ఓటు కూడా వృధా కాకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణపై ఫోకస్ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలపై ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వాహణపై చర్చించి, అధికారులకు శిక్షణ ఇచ్చారు. అంతేగాకుండా.. పోలింగ్ శాతాన్ని పెంచే కార్యక్రమాలపైనా సమీక్షించారు. ఈ రోజు హైదరాబాద్లో ఈసీ సమావేశం అయింది. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలో ఈసీ బృందం…. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్రాజ్, ఇతర అధికారులతో సమావేశమైంది. ఎన్నికల కసరత్తుపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఓటర్ల శాతాన్ని పెంచాలని ఈసీ నిర్ణయించింది. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఈవీఎం లు మోరాయించకుండా ముందుగానే వర్క్ షాప్ లు నిర్వహిస్తామని తెలిపింది.