Chikoti With Chinna Jeeyar: `చికోటి` సామ్రాజ్యంలో చినజియర్!
త్రిదండ చినజియర్ స్వామికి, క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు ఉన్న సంబంధం ఏమిటి?
- By CS Rao Published Date - 04:32 PM, Sat - 30 July 22
త్రిదండ చినజియర్ స్వామికి, క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించేంత క్లోజ్ దేనికి సంకేతం? చియర్ పై ఇప్పటి వరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అశ్వనీదత్ చేసిన ఆరోపణలు నిజమేనా? ప్రవీణ్ తో ఉన్న చనువు జియర్ ఆశ్రమాన్ని ప్రశ్నించేలా ఉందా? మనీ ల్యాండరింగ్ చేసిన ప్రవీణ్ తో జియర్ కు ఉన్న సాన్నిహిత్యం ఎటు వైపు దారితీస్తుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు సామాన్య భక్తుల్లో వినిపిస్తోన్న సమయం ఇది.
త్రిదండి జిన చియర్ స్వామి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన ఆధ్యాత్మిక వేత్త. తెలుగు రాష్ట్రాల్లో ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఖరీదైన భక్తులు ఆయన ఆశ్రమానికి వెళుతుంటారు. సినీ, రాజకీయ ప్రముఖులు స్వామి ఆశీస్సుల కోసం వెళుతుంటారు. ప్రత్యేకించి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జియర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. సీఎం కేసీఆర్ , జియర్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు బాగా కలిసి వచ్చాయి. పారిశ్రామికవేత్త రామేశ్వరరావు, జియర్ ను వేర్వేరుగా చూడలేనంత సాన్నిహిత్యం వాళ్లది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆశ్రమానికి కోట్ల విలువైన భూములను చాలా తక్కువ ధరకు కేటాయించింది. ముంచింతల్ లోని రామానుచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా పెద్ద ఈవెంట్ ను జియర్ నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రధాని మోడీ కి బాగా దగ్గరయ్యారని టాక్.
సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జరిగిన అవమానాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారట. అందుకే, జియర్ కు అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. ప్రొటోకాల్ కు విరుద్ధంగా కేసీఆర్ ను దూరంగా పెట్టారని ఆయన మనసు నొచ్చుకుందని చెప్పుకుంటారు. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్యా దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూరేలా యాదాద్రి ప్రారంభానికి జియర్ ను దూరంగా కేసీఆర్ ఉంచారు. గతంలో మాదిరిగా ఇద్దరి మధ్యా మనసులు కలవడంలేదని సన్నిహితులు చెప్పుకుంటారు. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు జియర్ ఆశ్రమం బ్లాక్ మనీ అడ్డా అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాదు, పలు విచారణ సంస్థలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బంకా జడ్సన్ జియర్ ఆశ్రమంలోని అక్రమాలపై ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వాల అండ కారణంగా స్వామి వైపు విచారణ సంస్థలు చూడడానికి ధైర్యం కూడా చేయలేకపోతున్నాయని వినికిడి.
ఇటీవల సమ్మక్క, సారలమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వీడియో జియర్ వీడియో ఒకటి వివాదం అయింది. తాజాగా క్యాసినో కింగ్ ప్రవీణ్ తో కారులో ప్రయాణిస్తోన్న వీడియో సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తోంది. మనీ ల్యాండరింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రవీణ్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద మొత్తంలో గ్యాంబిలింగ్ ఆడుతారని ఈడీ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చిందని తెలిసింది. సుమారు 7 నెలల్లో 7 దేశాల్లో క్యాసినో నిర్వహించిన చికోటి ప్రవీణ్ పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్ చేశాడని ఈడీ అనుమానిస్తోంది. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్లాండ్లలో క్యాసినోల కోసం ఇప్పటివరకు వెయ్యిమందికిపైగా విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించాని ఈడీ విచారణలో వెలుగుచూసిందని తెలుస్తోంది. విదేశాల కోసం విమానాలు బుక్ చేసిన సంపత్ , ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్ అకౌంట్లలో భారీగా ఈడీ నగదు గుర్తించింది.
అకౌంట్లలో నగదు లెక్కలు చెప్పాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లో 8 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు బయట పడిందని తెలుస్తోంది. శ్రీలంకలో ఈనెల 8 నుంచి 17 వరకు 2 సార్లు క్యాసినో నిర్వహించిన ప్రవీణ్ పంటర్స్ను ఉదయం తీసుకెళ్లి సాయంత్రం హైదరాబాద్ తీసుకొచ్చారట. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో క్యాసినో నిర్వహించిన చికోటి బాగోతాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈడీ ప్రయత్నం చేస్తోంది.
చీకటి వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ప్రవీణ్ తో చినజియర్ స్వామి సాన్నిహిత్యం ఏమిటి? అనేది పెద్ద ప్రశ్న. ఇటీవల జీయర్ జీవితం గురించి ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే జియర్ కోట్లాది రూపాయాలు ఎలా సంపాదించాడని నిలదీశారు. మైహోం రామేశ్వరరావు, జియర్ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా దత్ ప్రశ్నించారు. ఆశ్రమం కేంద్రంగా జరుగుతోన్న బ్లాక్ దందాపై సీబీఐ విచారణ చేయాలని ఒక ప్రైవేటు టీవీ ఛానల్ వేదికగా ఫోన్లో డిమాండ్ చేశారు. ఆయన చేసిన డిమాండ్ కు బలం చేకూరేలా ఇప్పుడు క్యాసినో కింగ్ ప్రవీణ్, జియర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఉంది. క్యాసినో గ్యాంబ్లర్ ప్రవీణ్ తో సంబంధాలున్న కొందరు సెలబ్రిటీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను గుర్తించింది. ఆ జాబితాలో జియర్ ఉన్నారా? అంటే ఈడీ దానికి సమాధానం చెప్పాలి. ఒక వేళ ప్రవీణ్ ఫోన్ జాబితాలో జియర్ పేరు ఉంటే ఈడీ ఏమి చేస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తం మీద మరోసారి జియర్ స్వామి సోషల్ మీడియా వేదికగా వివాదస్పదంగా మారారు. నెటిజన్లు ప్రవీణ్, జియర్ కారు ప్రయాణం పై పలు రకాలుగా ట్రోల్స్ చేయడం గమనార్హం.
Related News
Amit Shah ‘Deepfake’ Video Case: ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.