ప్రతిపక్ష పాత్రలో తీవ్ర సవాళ్లను ఎదురుకుంటున్న బిఆర్ఎస్
కేవలం ఫామ్ హౌస్ లేదా పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా, సభలో ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో వైఫల్యం చెందడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది పరోక్షంగా అధికార పక్షానికి రాజకీయంగా పైచేయి సాధించే అవకాశాన్ని ఇస్తోంది
- Author : Sudheer
Date : 03-01-2026 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
- ప్రతిపక్ష పాత్రలో తీవ్ర సవాళ్లను ఎదురుకుంటున్న బిఆర్ఎస్
- బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేస్తున్న సీఎం రేవంత్
- ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన కేసీఆర్, ఫామ్ హౌస్ కే పరిమితం
తెలంగాణ రాజకీయాల్లో పదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ రాష్ట్ర సమితి (BRS), ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఆశించిన స్థాయిలో తన బాధ్యతలను నిర్వర్తించలేకపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సుదీర్ఘ కాలంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన అత్యున్నత వేదికకు నాయకుడే దూరంగా ఉండటం వల్ల అటు నియోజకవర్గ ప్రజల్లో, ఇటు రాష్ట్ర ఓటర్లలో కొంత అసహనం కనిపిస్తోంది.

Kcr Assembly
కేవలం ఫామ్ హౌస్ లేదా పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా, సభలో ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో వైఫల్యం చెందడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది పరోక్షంగా అధికార పక్షానికి రాజకీయంగా పైచేయి సాధించే అవకాశాన్ని ఇస్తోంది. మరోవైపు, పార్టీ వారసుడిగా ప్రచారంలో ఉన్న కేటీఆర్ తీరుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభలో ఆయన చేసే ప్రసంగాలు, వాడే భాష కొన్నిసార్లు నిర్మాణాత్మక విమర్శల కంటే వివాదాలకే ఎక్కువ దారితీస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోవడంలో కేటీఆర్ విఫలమవుతున్నారనే భావన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అనుభవజ్ఞుడైన హరీశ్ రావుపై అందరూ ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయం అటు ఎమ్మెల్యేలను, ఇటు కార్యకర్తలను ఇరకాటంలో పడేసింది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన సమయంలో సభను వీడటం వల్ల, స్థానిక సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయి, ఇది అంతిమంగా ప్రతిపక్షం తన ప్రాధాన్యతను కోల్పోయేలా చేస్తోంది.
ఇవే అనుకుంటే బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కుటుంబ కేంద్రీకృత నాయకత్వం. గత ఎన్నికల్లో ప్రజలు ఒకే కుటుంబం చేతిలో అధికారం ఉండటాన్ని వ్యతిరేకించినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ, పార్టీలో అంతర్గత మార్పులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా కీలక పదవులను కుటుంబ సభ్యులకే కేటాయించడం వల్ల, సమర్థులైన ఇతర నేతలకు గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా ఒంటరి పోరాటం చేస్తూ బీఆర్ఎస్ మొత్తాన్ని ఆత్మరక్షణలో పడేస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవాలంటే కుటుంబ రాజకీయాల నుంచి బయటపడి, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.