TS BJP: ఆ ఇద్దరు నేతలపై వేటుకు రంగం సిద్ధం!
మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొందరు బీజేపీ నేతలు పదేపదే పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా అసమ్మతి సమావేశాలు నిర్వహిస్తూ.. మీడియాలో కథనాలు రాయించడాన్ని పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా పరిగణించింది.
- By Hashtag U Published Date - 11:42 AM, Wed - 23 February 22
మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొందరు బీజేపీ నేతలు పదేపదే పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా అసమ్మతి సమావేశాలు నిర్వహిస్తూ.. మీడియాలో కథనాలు రాయించడాన్ని పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా పరిగణించింది. వీరిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు సూచించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ వారిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అసమ్మతి నేతలకు నోటీసులు సిద్ధం చేశారు. ఒకటి, రెండ్రోజుల్లో నోటీసులకు ఆయా నేతలకు చేరనున్నట్లు తెలిసింది. వాస్తవానికి అసమ్మతి నేతల వ్యవహారాల శైలిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల్లో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్న తరుణంలో గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, సుగుణాకర్ రావు అసమ్మతి పేరిట పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించడాన్ని వారు తప్పుపడుతున్నారు.
ఆయా నేతలను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన కోర్ కమిటీలు తీర్మానం చేసి కొద్దిరోజుల క్రితం జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు పంపాయి. గుజ్జుల రామక్రిష్ణారెడ్డి దాదాపు 20 ఏళ్లకుపైగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారని, అయినా జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోగపోగా… పార్టీని నష్టపర్చేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాయి. వారి విషయంలో ఇంకా ఉపేక్షిస్తే పార్టీ నష్టపోయే ప్రమాదముందని తెలిపాయి. ఆయా జిల్లాల తీర్మానాలను వెంటనే పరిగణలోకి తీసుకున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అసమ్మతి నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కు సూచించారు.
అయితే బండి సంజయ్ మాత్రం గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, సుగుణాకర్ రావుల్లో మార్పు వస్తుందని ఆశిస్తూ ఇంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించారు. ఈ వ్యవహారాన్ని పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పగించారు. అసమ్మతి నేతలతో భేటీ అయిన ఇంద్రసేనారెడ్డి పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చించారు. ఇంద్రసేనారెడ్డి సూచనతో అసమ్మతి నేతలు అప్పట్లో సైలెంట్ అయ్యారు. దీంతో అసమ్మతి సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో తాజాగా మళ్లీ అసమ్మతి నేతలు హైదరాబాద్ లో సమావేశం నిర్వహించి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియాకు ఎక్కడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణించారు. తొలుత గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో 28 మంది నేతలు అసమ్మతి సమావేశం నిర్వహిస్తే… ఇంద్రసేనారెడ్డి జోక్యంతో వారిలో అత్యధికులు వెనక్కు తగ్గారు. తాజాగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశానికి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, సుగుణాకర్ రావు, రాములు, వెంకటరమణి సహా నలుగురైదుగురు మాత్రమే హాజరు కావడంతో వారందరికీ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యారు. బండి సంజయ్ ఆదేశాలతో పార్టీ లీగల్ విభాగం ఆయా నేతలకు నోటీసులను జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఆయా నేతలకు నోటీసులు అందనున్నాయని, వారిచ్చే వివరణ సంత్రుప్తికరంగా లేనిపక్షంలో వేటు వేయక తప్పదని పార్టీ వర్గాల స్పష్టం చేశాయి.
Related News
Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి
కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.