Caste Census : సమగ్ర కుల సర్వేకు ప్రజలంతా సహకరించాలి: మంత్రి పొన్నం
Caste Census : ఈ సర్వేలో సమాచారం సేకరిస్తున్నవారు, సమాచారం తెలుపుతున్నవారు ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.
- By Latha Suma Published Date - 04:04 PM, Fri - 1 November 24

Minister Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 6 నుంచి బీసీ సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టబోయే ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కులాల సర్వే) కు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ మాట మేరకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఈ జరుగుతున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ సర్వే రాబోయే కాలంలో అన్ని రకాల పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు ఒక మెగా హెల్త్ చెకప్ మాదిరిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్వేలో సమాచారం సేకరిస్తున్నవారు, సమాచారం తెలుపుతున్నవారు ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.
కాగా, నవంబర్ 6వ తేదీ నుంచి 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక అబ్జర్వర్ గా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల పర్యావేక్షణ ఉంటుందన్నారు. ఇంటింటి నుంచి సమగ్ర సమాచారం సేకరించి ఆ డేటాను ఎంట్రీ చేయడంతో పాటు నవంబర్ 30 లోపు ఈ సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కులగణన కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవో నెం 199 ద్వారా నిరంజన్ చైర్మన్ గా రాపోలు జయ ప్రకాశ్, తిరుమల గిరి సురేందర్, బాల లక్ష్మి మెంబర్లుగా బీసీ కమిషన్ ను నియమించిందని, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ను నోడల్ డిపార్ట్ మెంట్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ పౌరులతో పాటు ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలపై ప్రణాళికలు రచ్చించి వాటిని అమలు చేయడం నిమిత్తం ఈ సర్వే కోసం ఫిబ్రవరిలోనే శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్మాటక సీఎం సిద్దరామయ్య సమక్షంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 4న తెలంగాణలో ఇంటింటికి సమగ్ర సర్వే చేపట్టాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించిందన్నారు.