Bandi Sanjay : 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు : బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు.
- Author : Pasha
Date : 07-07-2024 - 2:19 IST
Published By : Hashtagu Telugu Desk
Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే వారంతా బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి తప్పకుండా రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. ఈవిషయం ఆ 26 మంది ఎమ్మెల్యేలకు చెప్పామని.. దానిపై వాళ్లు తర్జనభర్జన పడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని.. త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ పేరును అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన కేకే లాంటి నేతలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్న విషయాన్ని బండి సంజయ్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలను కేకే లాంటి నేతల ద్వారా నేర్చుకునే ప్రయత్నంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఉందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
స్మార్ట్ సిటీల అభివృద్ధి గడువును ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ.. ‘‘స్మార్ట్ సిటీ పనుల గడువు పెరగడం వల్ల కరీంనగర్కు మరిన్ని నిధులు వస్తాయి. సీఎం రేవంత్ ఒక్కరే అడిగితే స్మార్ట్ సిటీల అభివృద్ధి గడువును పొడిగించలేదు. వివిధ రాష్ట్రాల సీఎంలు కలిసి అడిగినందు వల్లే ఆ గడువును పెంచారు’’ అని తెలిపారు. వేములవాడ ఆలయాన్ని ఈసారి ప్రసాదం స్కీంలో చేర్చుతామని సంజయ్ వెల్లడించారు. రామాయణ సర్క్యూట్ కింద ఇళ్లందకుంట, కొండగట్టు దేవస్థానాలను చేర్చాలనే ప్రపోజల్ ఉందన్నారు. కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లైన్ సర్వే ఇప్పటికే పూర్తయిందన్నారు. కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాసంస్థల కోసం ప్రయత్నం చేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.
Also Read :CM Chandrababu: తెలంగాణ టీడీపీతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర ప్రజలకు బండి సంజయ్ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర మాసంలో అమ్మవారిని పూజిస్తే చల్లగా చూస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్షించారు. తెలంగాణ కల్చర్ పరిరక్షణకు బీజేపీ(bjp) కట్టుబడి ఉంటుందన్నారు.