Khammam : వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం: సీఎం రేవంత్ ప్రకటన
వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు
- Author : Sudheer
Date : 02-09-2024 - 6:22 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. అల్ప పీడన ప్రభావం తో తెలంగాణ లో గత నాల్గు రోజులుగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కొండపోత వర్షాలు పడడంతో జనజీవనం , రవాణావ్యవస్థ స్థంభించింది. ముఖ్యంగా ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం (Munneru Vagu Water Folw Raising) దాల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు ప్రకాశ్నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది. దీంతో కవిరాజ్నగర్, వీడియోస్ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్ రోడ్డు, కాల్వ ఒడ్డు.. దాదాపు పదుల సంఖ్యలో కాలనీల్లోని వరద నీరు పోటెత్తింది. పలు చోట్ల వరదలో అనేక మంది చిక్కుకున్నారు. పలువురి ప్రాణాలు సైతం కోల్పోయారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణ, ఆస్తి నష్టానికి ఆర్థిక సాయం ప్రకటించారు. పాడిపశువులు, గొర్రెలు, మేకలు నష్టపోయిన వారికి ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. వరదల్లో ధ్రువపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లీ ఒరిజినల్స్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. నష్టం అంచనా నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం ప్రకటించారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ధైర్యం చెడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి హామీ ఇచ్చారు. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆస్తి, పంటనష్టం సాయం అందించాలని అధికారులను ఆదేశించాం. అత్యవసర నిధిగా కలెక్టర్ ఖాతాలో రూ. 5 కోట్లు కేటాయించాం. మీకు రాబోయే ఉపద్రవాన్ని ప్రభుత్వం ముందుగానే ఊహించింది’ అంటూ వారికి భరోసా ఇచ్చారు.
అంతకు ముందు పాలేరు రిజర్వాయర్ను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్ఎస్పీ కాలువకు గండి పడటంతో పొలాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఆయన పంట పొలాలను పరిశీలించారు. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువ, నాయకన్గూడెం దగ్గర దెబ్బతిన్న రోడ్డు, పాలేరు ఏరును మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. ఇక సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి ఉన్నారు.
Read Also : Rain Effect : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు