TRAI New Rules: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్!
ఇప్పుడు టెలికాం కంపెనీలు వినియోగదారులకు కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్ను అందించాల్సి ఉంటుందని, ఇది వాయిస్ కాల్స్, SMS సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
- Author : Gopichand
Date : 24-12-2024 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
TRAI New Rules: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే TRAI టారిఫ్ నిబంధనలలో (TRAI New Rules) పెద్ద మార్పులు చేసింది. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కాల్లు, SMS కోసం వినియోగదారులకు ప్రత్యేక ప్లాన్లను అందించాలని నిర్ణయించింది. దీని వల్ల ఇప్పుడు కోట్లాది మంది వినియోగదారులు నేరుగా లబ్ధి పొందుతారు. కాల్లు, సందేశాలను మాత్రమే ఉపయోగించే.. డేటా అవసరం లేని కస్టమర్లకు ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కొత్త నిబంధనలలో ఏమి మార్చారు?
ఇప్పుడు టెలికాం కంపెనీలు వినియోగదారులకు కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్ను అందించాల్సి ఉంటుందని, ఇది వాయిస్ కాల్స్, SMS సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రత్యేక ప్లాన్ చెల్లుబాటు 365 రోజుల వరకు ఉంటుంది. గతంలో 90 రోజులకే పరిమితమైన ప్రత్యేక రీఛార్జ్ కూపన్ కాలపరిమితిని ఇప్పుడు 365 రోజులకు పొడిగించారు. ఇది మాత్రమే కాకుండా టెలికాం కంపెనీలు ఎంత మొత్తానికి అయినా ప్రత్యేక రీఛార్జ్ వోచర్లను జారీ చేయవచ్చు. అయితే వారు కనీసం రూ.10 వోచర్లను కూడా జారీ చేయాల్సి ఉంటుంది.
Also Read: Film Industry : ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోతుందా ? ఏం జరగబోతోంది ?
వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది
ఇప్పుడు వినియోగదారులు వారు ఉపయోగిస్తున్న సేవలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు సీనియర్ సిటిజన్లకు, ఇంటర్నెట్ డేటాను ఉపయోగించని వారికి, ముఖ్యంగా ఇంట్లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ కొత్త నిబంధనపై TRAI ఏం చెప్పింది?
వారి ఫోన్లలో కాలింగ్, SMS వంటి సేవలను మాత్రమే ఉపయోగించాలనుకునే వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి TRAI ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కోట్లాది మంది కస్టమర్లు ఇలాంటి డేటా ప్లాన్ల కోసం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. టెలికాం కంపెనీలు ఇప్పుడు కొత్త ప్లాన్లను త్వరలో విడుదల చేయగలవని అంచనా.