T20 World Cup: కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ పై గంగూలీ రియాక్షన్
విదేశీ గడ్డపై జరగాల్సిన టి20 ప్రపంచకప్ పై క్రికెట్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఫామ్ను చూసి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు
- Author : Praveen Aluthuru
Date : 11-05-2024 - 6:43 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు, రికార్డుల గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్మన్గా ఎవరూ సాధించని ఎన్నో అరుదైన ఘనతలను అతడు అందుకున్నాడు. లెజెండరీ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న అనేక రికార్డులను బ్రేక్ చేశాడు.
తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ సెవెంటీన్ లోనూ దుమ్ముదులుపుతున్నాడు. ఇటీవల పంజాబ్ కింగ్స్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ తో తనలోని విశ్వరూపాన్ని బయటపెట్టాడు. కేవలం 47 బంతుల్లో 97 పరుగులతో పంజాబ్ బౌలర్లని ఉతికారేశాడు. విరాట్ కోహ్లీ ఈ బలమైన ఇన్నింగ్స్ ని నెలకొల్పడంతో బెంగళూరు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు ప్లేఆఫ్ రేసులో తమను తాము సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఫామ్, అతడి ఫిట్నెస్ చూస్తుంటే మరో నాలుగేళ్లు ఈజీగా ఆడేలా కనిపిస్తున్నాడు. అదే జరిగితే క్రికెట్లో ఉన్న ఇంకా ఎన్నో రికార్డులు అతడి సొంతం అవుతాయని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటె టీమిండియా త్వరలో పొట్టి ప్రపంచకప్ లో ఆడేందుకు సిద్దమవుతుంది. విదేశీ గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీలో గెలవడం భారత్ కు చాలా అవసరం. గతేడాది చివర్లో జరిగిన ప్రపంచకప్ లో టీమిండియా ఫైనల్లో ఓడింది. వరుసగా పది మ్యాచ్ ల్లో గెలుస్తూ వచ్చిన భారత్ ఫైనల్ లో నిరాశపరిచింది. ఈ మ్యాచ్ లో ఆరంభంలో రోహిత్ విధ్వంసం సృష్టించగా చివర్లో కోహ్లీ నిలకడగా రాణించాడు. అయితే ఇచ్చిన టార్గెట్ చిన్నదే కావడంతో ఆసీస్ ఈజీగా గెలిచి ప్రపంచకప్ ను ఎగురేసుకుపోయింది. దీంతో విదేశీ గడ్డపై జరగాల్సిన టి20 ప్రపంచకప్ పై క్రికెట్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఫామ్ను చూసి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. రాబోయే టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా రావాలని గంగూలీ భారత జట్టు మేనేజ్మెంట్కు సలహా ఇచ్చాడు.విరాట్ అద్భుతంగా ఆడుతున్నాడని గంగూలీ అన్నాడు. కాగా ఐపీఎల్ 17వ సీజన్లో విరాట్ కోహ్లీ 12 ఇన్నింగ్స్లలో 153.51 స్ట్రైక్ రేట్తో 634 పరుగులు సాధించాడు.
Also Read: IPL 2024: ఢిల్లీకి బిగ్ షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్