Robin Uthappa: యువరాజ్ను జట్టు నుంచి తప్పించింది కోహ్లీనే.. ఉతప్ప సంచలనం!
ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు వన్డే ప్రపంచకప్ 2011 టైటిల్ను గెలుచుకుంది. ఈ ప్రపంచకప్లో యువరాజ్ బ్యాట్, బాల్తో అద్భుత ప్రదర్శన చేశాడు.
- By Gopichand Published Date - 01:13 PM, Fri - 10 January 25

Robin Uthappa: ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్పై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ విరాట్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఇప్పుడు విరాట్ ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) విరాట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ సింగ్ను విరాట్ జట్టు నుంచి తప్పించారని టీమిండియా మాజీ వెటరన్ క్రికెటర్ ఆరోపించాడు.
ఉతప్ప సంచలన ప్రకటన
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తాజాగా ఈ సంచలన విషయాన్ని వెల్లడించాడు. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ కెరీర్ను ముందుగానే ముగించడానికి విరాట్ కోహ్లీ కారణమని ఆరోపించాడు. విరాట్ కోహ్లీ.. యువరాజ్ సింగ్కు సహాయం చేయలేదని, అతనిని జట్టు నుండి తొలగించాడని మాజీ వికెట్ కీపర్ సంచలన విషయాలు చెప్పాడు. దీని కారణంగా యువరాజ్ను భారత క్రికెట్ జట్టు నుండి తొలగించాల్సి వచ్చిందని ఉతప్ప పేర్కొన్నాడు.
Also Read: KL Rahul: సెలక్టర్లను విరామం కోరిన కేఎల్ రాహుల్.. కారణమిదే?
లాలాంటాప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ ఉతప్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఉతప్ప అక్కడ మాట్లాడుతూ.. యువీని ఉదాహరణ తీసుకోండి. క్యాన్సర్ను ఓడించిన అతను అంతర్జాతీయ జట్టులో పునరాగమనం చేయడానికి ప్రయత్నించాడు. అతను మాకు ప్రపంచ కప్ తెచ్చిన ఆటగాడు. ఇతర ఆటగాళ్లతో కలిసి రెండు ప్రపంచ కప్లు గెలిచాడు. వాటిని గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడికి నువ్వు (విరాట్ను ఉద్దేశించి) కెప్టెన్ అయ్యాక జట్టులోకి వచ్చేందుకు టైమ్ ఇవ్వలేదు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్లేయర్ల ఫిట్నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు. అందరూ ఆటగాళ్లు తనలాగే ఉండాలనుకునేవాడని అన్నారు.
2011 వన్డే ప్రపంచకప్లో యువీ కీలక పాత్ర
ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు వన్డే ప్రపంచకప్ 2011 టైటిల్ను గెలుచుకుంది. ఈ ప్రపంచకప్లో యువరాజ్ బ్యాట్, బాల్తో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ను ఓడించిన తర్వాత యువరాజ్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. అయితే సెలెక్టర్లు అతన్ని ఎక్కువ శాతం రిజర్వ్ బెంచ్కే పరిమితం చేశారు. యువరాజ్ తన చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ 2017లో ఆడాడు.