Rohit Sharma: వన్డే రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
రోహిత్ తన ఆటతీరును విశ్లేషిస్తూ గతంలో మొదటి పది ఓవర్లలో 30 బంతులు ఆడితే 15 పరుగులు మాత్రమే వచ్చేవని, కానీ ఇప్పుడు 20 బంతుల్లో 30 లేదా 50 పరుగులు సాధించగలనని చెప్పారు.
- By Gopichand Published Date - 04:18 PM, Mon - 12 May 25

Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన వన్డే క్రికెట్ భవిష్యత్తుపై తలెత్తిన అనుమానాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఇటీవల టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డే క్రికెట్లో ఇంకా కొనసాగే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జట్టుకు తాను ఉపయోగపడటం లేదని అనిపించిన రోజు క్రికెట్కు వీడ్కోలు చెబుతానని, అయితే ప్రస్తుతం తన ఆట జట్టుకు సహాయపడుతుందని స్పష్టం చేశారు.
రోహిత్ తన ఆటతీరును విశ్లేషిస్తూ గతంలో మొదటి పది ఓవర్లలో 30 బంతులు ఆడితే 15 పరుగులు మాత్రమే వచ్చేవని, కానీ ఇప్పుడు 20 బంతుల్లో 30 లేదా 50 పరుగులు సాధించగలనని చెప్పారు. ఈ మాటలు ఆయన ఆటపై ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, క్రికెట్ను కొత్త కోణంలో చూసే విధానాన్ని ప్రతిబింబిస్తాయి. తాను నిరంతరం తన ప్రదర్శనను పరిశీలిస్తానని, 20-30 పరుగులతో సంతృప్తి పడటం తన విధానం కాదని రోహిత్ చెప్పారు. తన స్థాయిలో ఆడలేకపోతే వెంటనే ఆట నుండి తప్పుకుంటానని, కానీ ప్రస్తుతం తన ఆట జట్టుకు విలువైనదని ఆయన నొక్కి చెప్పారు.
టీ-20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీ-20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న నేపథ్యంలో రోహిత్ ఆ నిర్ణయం వెనుక తన ఆలోచనను వివరించారు. కప్ గెలవకపోయినా రిటైర్మెంట్ తీసుకునే ఉద్దేశం ఉండేదని, ఎందుకంటే తాను తన వంతు ప్రయత్నం చేశానని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అనుకున్నానని చెప్పారు. అయితే విజయం సాధించడం, ఆటలో మంచి ఫలితాలు రావడం వల్ల వన్డే క్రికెట్లో ఇంకొంత కాలం కొనసాగాలనే ఆలోచన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రోహిత్ వ్యాఖ్యలు వన్డే క్రికెట్లో ఆయన భవిష్యత్తుపై ఉన్న గందరగోళాన్ని తొలగించాయి. తన ప్రదర్శన ఆధారంగానే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటానని, ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడనని ఆయన స్పష్టం చేశారు. ఈ వైఖరి రోహిత్ స్వీయ-విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వ లక్షణాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం వన్డే క్రికెట్లో కొనసాగుతూ, జట్టుకు తన వంతు సహకారం అందిస్తానని రోహిత్ నమ్మకంగా ఉన్నారు. జట్టుకు ఉపయోగపడటం లేదని ఎప్పుడైనా అనిపిస్తే అదే రోజున క్రికెట్కి గుడ్బై చెప్తాను అని రోహిత్ చెప్పుకొచ్చాడు.