Gujarat Titans : హార్థిక్ పాండ్యా ఐపీఎల్ టీమ్ పేరేంటో తెలుసా ?
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ అయిన అహ్మదాబాద్ .. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది.
- By Hashtag U Published Date - 02:00 PM, Wed - 9 February 22

ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ అయిన అహ్మదాబాద్ .. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సీవీసీ క్యాపిటల్కు చెందిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ. తమ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ బుధవారం తమ అధికారిక ట్విటర్ వేదికగా వెల్లడించింది. అహ్మదాబాద్ జట్టుకు పేరు ఖరారు చేసేందుకు ట్విట్టర్ వేదికగా ఓ పోల్ను నిర్వహించిన సీవీసీ క్యాపిటల్ సంస్థ .. గుజరాత్ వాసులే పేరును సూచించాలని కోరింది. ఈ పోల్ లో ఎక్కువ మంది గుజరాత్ టైటాన్స్ పేరును ఎంపిక చేసినట్టు తెలిపింది. 2022 ఐపీఎల్ సీజన్ తో ఎంట్రీ ఇవ్వనున్న ఈ జట్టు మెగా వేలం ముంగిట ముగ్గురు స్టార్ క్రికెటర్లను ఎంచుకుంది. హార్దిక్ పాండ్యాతో పాటుగా అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, భారత ఓపెనర్ శుబ్మన్ గిల్ను తీసుకుంది.. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్లకు రూ. 15 కోట్ల చొప్పున… గిల్కు రూ. 7 కోట్లు అహ్మదాబాద్ చెల్లించనుంది. చాలా కాలంగా ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న పాండ్యాను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడంతో వేలానికి ముందే అహ్మదాబాద్ దక్కించుకుంది. అందరూ ఊహించినట్టుగానే పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. గత కొంత కాలంగా ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాండ్యా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు., ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించి ఐపీఎల్ తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు హార్థిక్ పాండ్యా సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది 2 కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వడంతో ఐపీఎల్ 10 జట్లతో జరగనుంది. బిడ్డింగ్ లో లక్నోను ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్ రూ.7090కోట్లకు, అహ్మదాబాద్ జట్టును రూ.5626కోట్లకు సీవీసీ క్యాపిటల్ దక్కించుకుంది.