COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
- Author : Vamsi Chowdary Korata
Date : 21-07-2026 - 10:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు కరోనా సృష్టించిన విలయతాండవం ఎవ్వరూ మరచిపోలేనిది. తల్లడిల్లుతూ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. అలాంటి మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షించగా, అవి RF 5 వేరియంట్గా నిర్ధారించారు. అయితే, ఈ కొత్త వేరియంట్తో అంత పెద్ద ప్రమాదమేమీ లేదని, కానీ దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజాగా వెలుగు చూసిన RF 5 వేరియంట్ రకం ఏంటంటే.. కోవిడ్-2 వైరస్ కాలక్రమంలో ఒమిక్రాన్గా రూపాంతరం చెందింది. దీని నుండి జేఎన్ 1 నుంచి ఎల్ఎఫ్ 7, 1.1.1 బ్రాంచ్లు ఏర్పడ్డాయి. వీటి రెండింటి కలయికే RF 5 అని పూణెలోని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఈ వేరియంట్ సోకిన వారికి దగ్గు, జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం ఎక్కువగా వస్తాయని, వెంటనే టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మళ్లీ కరోనా విస్తరిస్తున్న సమయంలో ఇకపై ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తూ, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, శ్వాస సంబంధిత సమస్యలు, గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
కరోనా లక్షణాలు ఉన్నవారు తొలుత హోం ఐసోలేషన్లో ఉండాలని, మూడు, నాలుగు రోజుల్లో తగ్గకపోతే వెంటనే వైద్యులను ఆశ్రయించాలని చెబుతున్నారు. తీవ్రంగా ఇబ్బంది పడితే ఆస్పత్రిలో చేర్పించి, వైద్యుల పర్యవేక్షణ తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.
కడప తర్వాత ఇప్పుడు గుంటూరులోనూ కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మంగళగిరి ప్రాంతంలో ముగ్గురు వైరస్ బారిన పడగా, ఇప్పుడు బాపట్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే, ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని, ఇది సీజనల్ కరోనా ఇన్ఫెక్షన్ అని వైద్యాధికారులు చెబుతున్నారు.