Vipraj Nigam: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిని బెదిరించిన మహిళ..!
గుర్తు తెలియని ఆ మహిళ తనను బహిరంగంగా అప్రతిష్ట పాలు చేయాలని, మానసికంగా వేధించాలని చూస్తోందని నిగమ్ ఆరోపించారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
- Author : Gopichand
Date : 10-11-2025 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
Vipraj Nigam: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు తరఫున ఆడుతున్న స్పిన్ ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్ (Vipraj Nigam)ను ఒక మహిళ ఫోన్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి, ఆ తర్వాత ప్రాణహాని కూడా కలిగించింది. నవంబర్ 9న నిగమ్కు అంతర్జాతీయ నంబర్ (International Number) నుండి ఆ మహిళ పదేపదే ఫోన్ చేసింది. ఆ తర్వాత అతని ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది. వాటిని నెరవేర్చకపోతే అతని వీడియోలను ఆన్లైన్లో లీక్ చేస్తానని బెదిరించడం ప్రారంభించింది. దీనిపై విప్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విప్రజ్ నిగమ్కు ప్రాణహాని బెదిరింపు
దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు విప్రజ్ నిగమ్కు నవంబర్ 9న అంతర్జాతీయ నంబర్ నుండి ఆ మహిళ పదేపదే కాల్ చేసింది. అతను మొదట ఆ నంబర్లను బ్లాక్ చేయడం ప్రారంభించినప్పటికీ ప్రతిసారీ వేరే నంబర్ నుండి కాల్స్ రావడం మొదలైంది. దీంతో 21 ఏళ్ల విప్రజ్ నిగమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: SSMB29: మహేష్ బాబు- రాజమౌళి ‘SSMB29’ ఫస్ట్ సింగిల్ విడుదల.. టైటిల్ ఇదేనా!
గుర్తు తెలియని ఆ మహిళ తనను బహిరంగంగా అప్రతిష్ట పాలు చేయాలని, మానసికంగా వేధించాలని చూస్తోందని నిగమ్ ఆరోపించారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. పదేపదే కాల్స్ వచ్చిన ప్రదేశం, కాల్ వివరాలు, డిజిటల్ సాక్ష్యాలను కనుగొనడం ప్రారంభించారు. ఈ సంఘటనతో క్రికెటర్ కుటుంబం మొత్తం ఆందోళన చెందుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శన
ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ ఆటగాడిని ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ నిగమ్కు మొత్తం 14 మ్యాచ్లలో అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను 142 పరుగులు చేసి, 11 వికెట్లు కూడా తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఢిల్లీ జట్టు విప్రజ్ను రీటైన్ (retain) చేసుకునే అవకాశం ఉంది. దీంతో అతను ఐపీఎల్ 2026లో కూడా ఈ జట్టులో కొనసాగవచ్చు. విప్రజ్ నిగమ్ ఇటీవల యూపీ టీ20 లీగ్లో కూడా పాల్గొని అక్కడ కూడా ఆకట్టుకున్నాడు.