India vs New Zealand : టెస్టు సిరీస్ కివీస్ కైవసం.. రెండో టెస్టులోనూ ఓడిన భారత్
12ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ను(India vs New Zealand) భారత్ కోల్పోయింది.
- By Pasha Published Date - 04:19 PM, Sat - 26 October 24

India vs New Zealand : మహారాష్ట్రలోని పూణే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులోనూ భారత జట్టు ఓటమిని చవిచూసింది. దీంతో మూడు టెస్టుల ఈ సిరీస్లో భారత్ రెండు వరుస ఓటములను మూటకట్టుకోవాల్సి వచ్చింది. రెండో టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. 359 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన భారత్ 245 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. గెలుపు సాధించడానికి న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యానికి 113 పరుగుల దూరంలో భారత్ మిగిలిపోయింది.
Also Read :Jio Hotstar : ‘జియో హాట్స్టార్’ డొమైన్ వ్యవహారం.. తెరపైకి ఇద్దరు పిల్లలు
టీమ్ ఇండియాలో యశస్వీ జైస్వాల్ చక్కగా రాణించి 77 రన్స్ చేయగా, రవీంద్ర జడేజా 42 రన్స్ చేశాడు. న్యూజిలాండ్ మొదటి ఇన్సింగ్స్లో 259 రన్స్, రెండో ఇన్సింగ్స్లో 255 రన్స్ చేసింది. భారత జట్టు మొదటి ఇన్సింగ్స్లో 156 రన్స్, రెండో ఇన్సింగ్స్లో 245 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ శాంట్నర్.. సెకండ్ ఇన్నింగ్స్లోనూ 6 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ 34 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది. రోహిత్ కేవలం 8 పరుగులే చేశాడు. శుభ్మన్ గిల్ 23 పరుగులు తీసి ఔట్ అయ్యాడు. ఒకానొక దశలో శుభ్మన్ గిల్, జైస్వాల్ పార్ట్నర్షిప్ భారత్కు గెలుపుపై ఆశలను పెంచింది. భోజన విరామ సమయానికి భారత్ 81/1 స్కోరుతో మెరుగ్గా కనిపించింది.
Also Read :Indian Immigrants : ఆ భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
అయితే రెండో సెషన్లో భారత్ వరుసపెట్టి ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా కివీస్ గెలుపు అవకాశాలు పెరిగిపోయాయి. యశస్వి జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ (17), సర్ఫరాజ్ ఖాన్ (9) వికెట్లను న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ పడగొట్టాడు. రిషభ్ పంత్ డకౌట్ కాగా, రవీంద్ర జడేజా (42) చివర్లో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 12ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ను(India vs New Zealand) భారత్ కోల్పోయింది. భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు సిరీస్ను గెలవడం ఇదే తొలిసారి. భారత్, న్యూజిలాండ్ మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలో ప్రారంభంకానుంది.