IND vs ENG: తొలి టెస్టులో స్పిన్ మంత్రమే.. భారత్ తుది జట్టే ఇదే
కొత్త ఏడాదిలో తొలి టెస్ట్ సవాల్ కు భారత్ సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతోంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. భారత్లో భారత్ను ఓడించాలంటేఏ జట్టుకూ అంత ఈజీ కాదు.
- Author : Vamsi Chowdary Korata
Date : 24-01-2024 - 6:13 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs ENG: కొత్త ఏడాదిలో తొలి టెస్ట్ సవాల్ కు భారత్ సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతోంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. భారత్లో భారత్ను ఓడించాలంటేఏ జట్టుకూ అంత ఈజీ కాదు. హోంఅడ్వాంటేజ్ తో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టార్ క్రికెటర్ కోహ్లి స్థానంలో ఎవరొస్తారనేది తెలియాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. శుభ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు రానుండగా.. కోహ్లి ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. స్పిన్లో అతడు సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగలడు. దీంతో శ్రేయస్ నాలుగో స్థానం దాదాపు ఖరారైనట్లే.
ఇక కేఎల్ రాహుల్ అయిదో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. వికెట్ కీపర్గా ఆంధ్రా కుర్రాడు కేఎస్ భరత్ బరిలోకి దిగనున్నాడు.ధ్రువ్ జురెల్ కూడా వికెట్ కీపర్గా అందుబాటులో ఉన్నప్పటికీ భరత్కే అవకాశం దక్కనుంది. ఇక బౌలింగ్ కూర్పుకు సంబంధించి జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఖాయం. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తో పాటు పిచ్ స్పిన్ కే అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో మూడో స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. మూడో స్పిన్నర్గా జట్టులో చోటు కోసం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అక్షర్ బ్యాటుతోనూ రాణించే సత్తా ఉండటంతో అతడి వైపు టీమిండియా యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇద్దరు పేసర్లుగా బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగనున్నారు.
Also Read: Chandigarh Mayor Elections: జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు