India- Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మధ్య మూడు మహాపోర్లు ఖాయమా?
ఈ మూడు మ్యాచ్లు నిజంగా జరిగితే ఇది క్రికెట్ అభిమానులకు పండుగే. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా ఉండటంతో పాటు ఆసియా కప్ టోర్నమెంట్కు మరింత ప్రాధాన్యత వస్తుంది.
- Author : Gopichand
Date : 25-08-2025 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
India- Pakistan: క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఆసియా కప్ 2025 సమరం సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లో అభిమానులను అత్యంత ఉత్సాహపరిచే భారత్, పాకిస్తాన్ (India- Pakistan) మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 14న ఈ రెండు దేశాల మధ్య తొలి పోరు జరగనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇటీవల భారత ప్రభుత్వం అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పాకిస్థాన్ను బహిష్కరించబోమని స్పష్టం చేయడంతో ఈ మ్యాచ్కు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్లు ఖాయమని తేలిపోయింది. అయితే ఈసారి కేవలం ఒక్క మ్యాచ్తో సరిపెట్టకుండా ఈ రెండు జట్ల మధ్య ఏకంగా మూడుసార్లు పోరు జరిగే అవకాశం ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మూడు దశల్లో భారత్-పాక్ పోరు
తొలుత ఈ రెండు జట్లు లీగ్ దశలో భాగంగా సెప్టెంబర్ 14న ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీగ్ దశ తర్వాత టోర్నమెంట్ సూపర్ 4 దశలోకి అడుగుపెడుతుంది. అప్పటికి భారత్, పాకిస్తాన్ జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో ముందుకు సాగితే, సూపర్ 4లో మరోసారి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. గత టోర్నమెంట్లలో కూడా ఈ తరహా పోరు జరిగింది. లీగ్, సూపర్ 4 దశల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్కు చేరుకుంటే సెప్టెంబర్ 28న జరిగే తుది పోరులో భారత్, పాకిస్తాన్ మళ్ళీ తలపడే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఆసియా కప్ చరిత్రలో ఇది ఒక అరుదైన, మరచిపోలేని ఘట్టంగా నిలిచిపోతుంది.
Also Read: Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్!
ఈ మూడు మ్యాచ్లు నిజంగా జరిగితే ఇది క్రికెట్ అభిమానులకు పండుగే. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా ఉండటంతో పాటు ఆసియా కప్ టోర్నమెంట్కు మరింత ప్రాధాన్యత వస్తుంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పుడు సెప్టెంబర్ 14 తర్వాత వచ్చే మ్యాచ్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ జట్టు ఆసియా కప్ గెలవాలని, ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించాలని కోరుకుంటున్నారు.