India 1st Test: విజయానికి చేరువలో భారత్
బంగ్లాదేశ్తో (Bangladesh) జరుగుతున్న తొలి టెస్టులో (Team India) భారత్ విజయానికి చేరువైంది. ఇవాళ తొలి సెషన్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు పోరాడినప్పటకీ... లంచ్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు.
- By Naresh Kumar Published Date - 12:05 AM, Sun - 18 December 22
బంగ్లాదేశ్తో (Bangladesh) జరుగుతున్న తొలి టెస్టులో (Team India) భారత్ విజయానికి చేరువైంది. ఇవాళ తొలి సెషన్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు పోరాడినప్పటకీ… లంచ్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. వరుస వికెట్లు పడగొట్టి బంగ్లాను కట్టడి చేశారు. నిన్న చివరి సెషన్లో వికెట్ కోల్పోకుండా పట్టుదలగా ఆడిన బంగ్లా ఓపెనర్లు నాలుగోరోజు ఆరంభంలో నిలకడగా బ్యాటింగ్ కొనసాగించారు. సింగిల్స్కు ప్రాధాన్యత ఇస్తూ భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఓపెనర్లు తొలి వికెట్కు 124 పరుగులు జోడించారు.
శాంటో 67 రన్స్కు ఔటైన తర్వాత బంగ్లా కీలక వికెట్లు చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ జాకిర్ హసన్ సెంచరీ సాధించాడు. 12 ఫోర్లు , 1 సిక్సర్తో 100 పరుగులకు ఔటయ్యాడు. అశ్విన్ అతన్ని పెవిలియన్కు పంపాడు. తర్వాత ముష్పికర్ రహీమ్, షకీబు్ హసన్ బంగ్లా ఇన్నింగ్స్ కొనసాగించారు.
వీరి పార్టనర్షిప్ను అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ముష్పికర్ రహీమ్ను 23 రన్స్కు ఔట్ చేశాడు. కాసేపటికే వికెట్ కీపర్ నురాల్ హసన్ను కూడా పెవిలియన్కు పంపడంతో బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ షకీబుల్ హసన్ చివరి సెషన్లో ఎదురుదాడికి దిగాడు. 69 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 40 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
మరో బ్యాటర్ మెహదీ హసన్ మిరాజ్ 9 రన్స్తో క్రీజులో ఉన్నాడు. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్లకు 272 పరుగులు చేసింది. చివరి రోజు విజయం కోసం బంగ్లా 241 పరుగులు చేయాల్సి ఉండగా… భారత్ 4 వికెట్లు పడగొట్టాలి. షకీబుల్ తప్పిస్తే మిగిలిన వారంతా టెయిలెండర్లు కావడంతో రేపు తొలి సెషన్లోనే బంగ్లాను ఆలౌట్ చేసే అవకాశముంది.
Related News
T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.