భారత్- పాక్ మధ్య మరోసారి మ్యాచ్ జరగనుందా?
భారత్- పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్కు చేరుకుంటే మాత్రం తలపడే అవకాశం ఉంది. కానీ దానికి ఒక నిబంధన ఉంది. సూపర్-8 దశలో ఒక జట్టు తన గ్రూపులో మొదటి స్థానంలో మరో జట్టు రెండో గ్రూపులో రెండో స్థానంలో నిలవాలి.
- Author : Gopichand
Date : 16-02-2026 - 4:52 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs PAK: ఆదివారం ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లో టీమ్ ఇండియా 61 పరుగుల తేడాతో ఏకపక్షంగా విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్పై భారత్కు ఇది 8వ విజయం. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఈ విజయంతో సూపర్-8లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. దీనికి ముందు భారత్.. అమెరికా, నమీబియా జట్లను ఓడించింది.
మరోవైపు ఈ ఓటమితో పాకిస్థాన్ దారి కాస్త కష్టతరమైంది. సూపర్-8కు చేరుకోవాలంటే నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్లో పాక్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్లో భారత్-పాక్ మధ్య మళ్లీ పోరు జరుగుతుందా? అనే ప్రశ్న అభిమానుల మనసులో మెదులుతోంది. ఆ సమీకరణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: అమావాస్య రోజు వచ్చే సూర్య గ్రహణం లో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
సూపర్-8లో భారత్-పాక్ తలపడవు
పాకిస్థాన్ జట్టు నమీబియాపై విజయం సాధిస్తే, గ్రూప్-A పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సూపర్-8కు అర్హత సాధిస్తుంది. అయితే సూపర్-8కు చేరుకున్నప్పటికీ పాకిస్థాన్.. భారత్తో తలపడదు. ఈ టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లను A, B, C, D అనే నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి టాప్-2 జట్లు సూపర్-8కు వెళ్తాయి. ఆ తర్వాత ఈ 8 జట్లను రెండు కొత్త గ్రూపులుగా విభజించి, రౌండ్-రాబిన్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుతాయి.
టోర్నీ ప్రారంభానికి ముందే ఐసీసీ (ICC) జట్లకు ‘ప్రీ-సీడింగ్’ ఇచ్చింది. భారత్కు X1, పాకిస్థాన్కు Y3 స్లాట్ కేటాయించింది. అలాగే ఇంగ్లాండ్కు Y1, ఆస్ట్రేలియాకు X2, న్యూజిలాండ్కు Y2, వెస్టిండీస్కు X3, సౌతాఫ్రికాకు X4, శ్రీలంకకు Y4 సీడింగ్ ఇచ్చారు. దీని అర్థం ఏమిటంటే.. సూపర్-8లో ఈ రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉంటాయి. కాబట్టి సూపర్-8 దశలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సాధ్యం కాదు.
సెమీఫైనల్లో భారత్-పాక్ పోరు జరగవచ్చు
భారత్- పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్కు చేరుకుంటే మాత్రం తలపడే అవకాశం ఉంది. కానీ దానికి ఒక నిబంధన ఉంది. సూపర్-8 దశలో ఒక జట్టు తన గ్రూపులో మొదటి స్థానంలో మరో జట్టు రెండో గ్రూపులో రెండో స్థానంలో నిలవాలి. ఒకవేళ రెండు జట్లు తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచినా లేదా రెండూ రెండో స్థానంలో నిలిచినా సెమీఫైనల్లో తలపడే అవకాశం ఉండదు. ఒకవేళ రెండు జట్లు సూపర్-8లో తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిస్తే అప్పుడు భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ను మనం చూడవచ్చు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 2007లో మాత్రమే ఫైనల్లో తలపడ్డాయి.