WTC Final 2023: ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసిన వెంటనే లండన్ కు..
ఒక వైపు ఐపీఎల్ సీజన్ హోరా హోరీగా సాగుతోంది. మరోవైపు వచ్చే నెలలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుండగా...టైటిల్ కోసం భారత్ , ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
- Author : Naresh Kumar
Date : 05-05-2023 - 6:20 IST
Published By : Hashtagu Telugu Desk
WTC Final 2023 : ఒక వైపు ఐపీఎల్ సీజన్ హోరా హోరీగా సాగుతోంది. మరోవైపు వచ్చే నెలలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుండగా…టైటిల్ కోసం భారత్ , ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అయితే ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసిన వెంటనే భారత క్రికెటర్లు లండన్ కు బయలుదేరనున్నారు. ప్లే ఆఫ్ కు చేరని జట్లలో ఉన్న టెస్ట్ టీమ్ ప్లేయర్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో లండన్ కి వెళ్లి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం మిగిలిన ఆటగాళ్లు వెళ్లనున్నారు. ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత్ ఇంగ్లాండ్ కండిషన్స్ కు అలవాటు పడేలా ప్రాక్టీస్ చేయనుంది.
అయితే పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవడం టీమిండియాకు ఎదురుదెబ్బ గానే చెప్పాలి. ఫాస్ట్ బౌలర్ బూమ్రా , వికెట్ కీపర్ రిషబ్
పంత్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా టీమిండియాకు దూరమయ్యారు. తాజాగా ఓపెనర్ కే ఎల్ రాహుల్ కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకున్నాడు. అయితే ముందు జాగ్రత్తగా కొందరిని స్టాండ్ బై ప్లేయర్స్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, ముకేష్ కుమార్, నవదీప్ సైని ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే 15 మంది జాబితాలో రహానే ఎంపిక ఒక్కటే ఆశ్చర్య పరిచింది. ఐపీఎల్లో అదరగొట్టే ప్రదర్శన చేస్తున్న అజింక్య రహానేకు బోర్డు పిలుపునిచ్చింది. రహానేకు 17 నెలల విరామం తర్వాత బీసీసీఐ నుంచి పిలుపు అందడం విశేషం. వికెట్ కీపర్గా ఆంధ్రా క్రికెటర్ కేఎస్ భరత్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్లను డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జూన్ 7 నుంచి 11 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Also Read: Meesho Layoffs: “మీషో”లో 251మందికి ఉద్వాసన.. 9 నెలల శాలరీతో సెటిల్మెంట్ !