Dhoni: CSK ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
- Author : Vamsi Chowdary Korata
Date : 16-04-2026 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
చెన్నై సూపర్ కింగ్స్ తలా ఎంఎస్ ధోనీ అభిమానులను మరోసారి నిరాశ పరిచాడు. ఐపీఎల్ 2026లో సీఎస్కే ఐదు మ్యాచ్లు ఆడితే ధోనీ ఒక్క మ్యాచ్లో కూడా గ్రౌండ్లోకి దిగలేదు. కండరాల సమస్యతో సీజన్ ప్రారంభానికి ముందే దూరమైన ధోనీ ఇప్పటి వరకు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వలేదు. తొలుత రెండు వారాల పాటు విశ్రాంతి అన్నారు.. కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. సన్రైజర్స్ మ్యాచ్తో రీ ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు.. కానీ, ఇప్పటి వరకు ధోనీ ఆడటంపై క్లారిటీనే లేదు.
ధోనీ ఫ్యాన్స్కి మళ్లీ బ్యాడ్ న్యూసే. ఎప్పుడెప్పుడు ధోనీని గ్రౌండ్లో చూద్దామనుకుంటున్న ఫ్యాన్స్కు మళ్లీ మళ్లీ నిరాశే ఎదురవుతోంది. ఏప్రిల్ 18న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్కి ధోనీ కచ్చితంగా అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేయడం, ఫుల్ ఫిట్నెస్తో ఉండటంతో ఉప్పల్ స్టేడియం విజిల్స్ మోతతో మార్మోగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజా అప్డేట్ తీవ్ర నిరాశకు గురి చేసింది.
ధోనీ నెట్స్లో నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో మాత్రం ఆడే అవకాశాలు కనిపించడం లేదు. సీఎస్కే స్క్వాడ్ ఈ రోజు తర్వాత హైదరాబాద్ పయనమవ్వనుంది. అయితే ధోనీ తన ప్లాన్ గురించి ఇంకా ఏ సమాచారం ఇవ్వలేదు” అంటూ క్రిక్బజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
కండరాల సమస్యతో సీజన్ ప్రారంభానికి ముందే జట్టుకు దూరమైన ధోనీ, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. మొదట రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని సీఎస్కే మేనేజ్మెంట్ వెల్లడించింది. కానీ, రెండు వారాల తర్వాత కూడా పూర్తిగా కోలుకోకపోవడంతో.. ఎప్పుడు రికవరీ అవుతాడో తెలియదని, ఫుల్ ఫిట్నెస్ సాధించాకే జట్టులో జాయిన్ అవుతాడని స్టేట్మెంట్ వచ్చింది.
సీఎస్కే ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో ఐపీఎల్ 2026లో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ సమయంలో ధోనీ కూడా జట్టులో ఉంటే ప్లానింగ్స్తో ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తాడని అందరూ అనుకున్నారు. కానీ, పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో బయటే ఉండాల్సి వచ్చింది. ధోనీ ఆడకపోయినా.. ప్రతీ మ్యాచ్కి ముందు జట్టుతో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు.
టీమ్ ప్రాక్టీస్ సమయంలో అక్కడే ఉంటూ సలహాలు, సూచనలు అందిస్తున్నాడు. కేకేఆర్ మ్యాచ్కి ముందు ధోనీ ఇచ్చిన సలహాలతో నూర్ అహ్మద్ కీలక వికెట్లు తీసుకున్నాడు. ధోనీ ఆడకపోయినా.. విజయాల్లో జట్టుకు సహకారాలు అందిస్తున్నాడు. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ వస్తాడని ముందుగా వార్తలు రావడంతో ఉప్పల్లో టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. ఇప్పటి వరకు ధోనీ రాకపై ఎలాంటి సమాచారం లేదు. ధోనీ వచ్చేది, రానిది ఈ రోజు తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది.