టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గొడవ.. వీడియో వైరల్!
బంతి తగలగానే మిచెల్ తీవ్ర అసహనానికి, కోపానికి గురయ్యాడు. ఆ వెంటనే అంపైర్ అర్ష్దీప్ సింగ్కు నచ్చజెప్పారు. ఆ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా మిచెల్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి అతనితో మాట్లాడి శాంతింపజేశాడు.
- Author : Gopichand
Date : 08-03-2026 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup 2026: భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ పోరులో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించి మూడో సారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో అంటే న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో ఉన్న సమయంలో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్- కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ మధ్య తీవ్రమైన వివాదం చోటుచేసుకుంది.
భారత్ తరఫున అర్ష్దీప్ 11వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ రెండో, మూడో బంతులకు డారిల్ మిచెల్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఒక బంతి వైడ్ కాగా, మరొకటి డాట్ బాల్ అయ్యింది. ఐదో బంతి కూడా డాట్ బాల్గానే నమోదైంది. అయితే ఈ బంతి వేసిన తర్వాత అర్ష్దీప్ కోపంతో కావాలని బంతిని డారిల్ మిచెల్ వైపు విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో చూసినట్లయితే అర్ష్దీప్ వేసిన బంతిని మిచెల్ తిరిగి బౌలర్ వైపునకే ఆడాడు. మిచెల్ పక్కకు తప్పుకోవడంతో స్టంప్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అర్ష్దీప్ రన్ అవుట్ చేయడానికి స్టంప్స్ను లక్ష్యంగా చేసుకోకుండా కావాలని డారిల్ మిచెల్ను గురిపెట్టి బంతిని విసిరాడు.
Also Read: టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ మనదే!!
Arshdeep Singh apologising to Darly Mitchell 👌 pic.twitter.com/xa4ArtyGlE
— Johns. (@CricCrazyJohns) March 8, 2026
కోపానికి గురైన డారిల్ మిచెల్
బంతి తగలగానే మిచెల్ తీవ్ర అసహనానికి, కోపానికి గురయ్యాడు. ఆ వెంటనే అంపైర్ అర్ష్దీప్ సింగ్కు నచ్చజెప్పారు. ఆ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా మిచెల్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి అతనితో మాట్లాడి శాంతింపజేశాడు. ఓవర్ ముగిసిన తర్వాత డారిల్ మిచెల్- అర్ష్దీప్ సింగ్ కూడా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో వివాదం సర్దుమణిగింది.
భారత్ భారీ స్కోరు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. భారత్ తరఫున సంజూ 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు ఇషాన్ కిషన్ 54 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులతో రాణించారు.