PM Modi : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..!
ఈ భేటికి నిర్మలా సీతారామన్తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ,సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం,ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్,సుర్జిత్ భల్లా,డీకే జోషి వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు హాజరయ్యారు.
- By Latha Suma Published Date - 05:33 PM, Tue - 24 December 24

PM Modi : కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఈక్రమంలోనే ప్రధాని మోడీ బడ్జెట్కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు. ఈ భేటికి నిర్మలా సీతారామన్తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ,సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం,ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్,సుర్జిత్ భల్లా,డీకే జోషి వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు హాజరయ్యారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి మందగమనం దృష్ట్యా ఈ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి తగ్గిపోగా,ఇది దాదాపు రెండేళ్ల కనిష్ఠం. ఆర్బీఐ అంచనాలకు మించి వృద్ధి తగ్గుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జిడిపి ఏకంగా 8.1 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. గడిచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6.7 శాతానికి పరిమితమైంది. ఈ రెండింటితోనూ పోల్చినా జీడీపీ భారీ తగ్గుదల నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు రేటింగ్ ఏజెన్సీలు కూడా 6శాతం ఎగువన వృద్ధి ఉండొచ్చని అంచనా వేయగా.. వాటి కంటే తక్కువగా పడిపోవడం గమనార్హం.
ఇక..రాబోయే బడ్జెట్లో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చే చర్యలు లేదా సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది.ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ట్రంప్ భారత్, చైనా వంటి దేశాల వస్తువులపై సుంకాలను పెంచుతామని వెల్లడించడం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఆర్థిక మంత్రులు నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో ప్యాకేజీ కేటాయింపులపై చర్చ జరగడం వంటి అంశాలు కూడా ప్రాధాన్యత సాధించాయి. పంజాబ్,కేరళ వంటి రాష్ట్రాలు వడ్డీ లేని 50ఏళ్ల రుణాల కేటాయింపులను పెంచాలని కోరడంతో కేంద్రం బడ్జెట్పై మరింత దృష్టి సారించింది.
మరో వైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 20న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించారు. పంజాబ్, కేరళ సహా పలు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు కేంద్రం నుంచి ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, మూల ధనం వ్యయం కోసం 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాల కేటాయింపును పెంచాలని కేంద్రాన్ని కోరారు.