Telangana Pragathi Patham: తెలంగాణ ప్రగతి పథం బుక్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.
- Author : Praveen Aluthuru
Date : 25-07-2023 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Pragathi Patham: రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ, పరిశ్రమల శాఖ, వైద్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, ఐటీ శాఖ, ఆర్థిక శాఖ తదితర శాఖలలోని ప్రగతి వివరాలు పొందుపరిచిన “తెలంగాణ ప్రగతి పథం” కాఫీ టేబుల్ బుక్ ను సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ సహచర మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి తదితర అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మన పాలనా సామర్థ్యంపై విమర్శలు ఎక్కుపెట్టిన వారికి నేటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “తెలంగాణ ప్రగతి పథం” పుస్తకం సరియైన సమాధానాలను ఇస్తుందని అన్నారు. రాష్ట్రం వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధి దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి శిఖరాలకు చేరుకున్న తీరు యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిందని సీఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా “తెలంగాణ ప్రగతి పథం” పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి, రూపొందించిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తెలుగు విభాగం కోఆర్డినేటర్ శ్రీ సువర్ణ వినాయక్, భాషా విభాగం సభ్యులు శ్రీ సంబరాజు రవి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి (OSD) శ్రీ విద్యాసాగర్ తదితరులను ముఖ్యమంత్రి అభినందించి వారికి పుస్తక ప్రతులను అందజేశారు.