Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు
- Author : Vamsi Chowdary Korata
Date : 20-05-2026 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా అల్లుడికి బట్టలు, ఉంగరాలు గిఫ్ట్గా ఇస్తారు. మన తెలుగు వాళ్లైతే వందల రకాల వంటకాలతో కడుపు నింపుతారు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఓ అత్తింటివారు ఏకంగా వెండి చెప్పులు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయ పండుగ వేళ అల్లుడికి ఇచ్చిన ఆ లగ్జరీ కానుక ముచ్చట్లేంటో చూద్దాం..
కానుక ఎందుకంటే
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ వ్యక్తి తన అల్లుడి కోసం ప్రత్యేక బహుమతి ప్లాన్ చేశారు. దానికోసం ఏకంగా వెండి కొల్హాపూరి చప్పల్స్ తయారు చేయించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే అధిక మాసం కోసం ఈ వినూత్న కానుకను సిద్ధం చేయించారు. అధిక మాసంలో అల్లుళ్లకు బహుమతులు ఇవ్వడం మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీ.
కళాకారుడి ప్రతిభ
ప్రతిభానగర్కు చెందిన విక్రాంత్ మాలి ఈ చెప్పులను తయారు చేశారు. సాంగ్లీకి చెందిన ఓ నగలవ్యాపారి ఆయనకు ఈ ఆర్డర్ ఇచ్చారు. విక్రాంత్ గత ఇరవై ఏళ్లుగా వెండి పనులు చేస్తున్నారు. కానీ చెప్పులు తయారు చేయడం ఆయనకు ఇదే తొలిసారని వెల్లడించారు.
1.5 కిలోల వెండి
ఈ చెప్పుల కోసం 95 శాతం స్వచ్ఛమైన 1.5 కిలోల వెండిని ఉపయోగించారు. విరిగిపోకుండా ఉండటానికి క్యాడ్మియం కలిపారు. దీంతో వీటిని షోకేస్లో పెట్టడమే కాకుండా సాధారణ చెప్పుల్లా వాడుకోవచ్చు. అసలైన తోలు చెప్పును కొని ఆ డిజైన్ను పూర్తిగా అధ్యయనం చేసి విక్రాంత్ దీన్ని రూపొందించారు.
తయారీకి 9 రోజులు
ఈ చెప్పుల తయారీకి దాదాపు తొమ్మిది రోజుల సమయం పట్టింది. తయారీ ఖర్చుల కోసమే విక్రాంత్ రూ.22 వేలు తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ‘ప్రాడ’ అమ్మే కొల్హాపూరి చెప్పుల ధర రూ.84 వేలు ఉంటే, ఈ అత్తింటివారు ఏకంగా రూ.4.25 లక్షలు ఖర్చు చేసి వెండి చెప్పుల తయారు చేయించారు
విక్రాంత్ గతంలోనూ ఇలాంటి ఎన్నో వింత వస్తువులు తయారు చేశారు. వెండితో కత్తులు, బ్యాట్, బాల్, వాటర్ కంటైనర్లు తయారు చేశారు. శివాజీ మహారాజ్ తలపాగా కూడా వెండితో రూపొందించారు.