HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు
- Author : Prasad
Date : 25-05-2026 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత ప్రమాణాలను పర్యవేక్షించే చర్యల్లో భాగంగా సీఎంసీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు మాధాపూర్లోని ఒక రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో సిబ్బంది ఏప్రాన్లు, హెయిర్నెట్స్ ధరించి పరిశుభ్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. మరోవైపు ఆహార నిల్వలు, భద్రత విషయంలో పలు లోపాలను గుర్తించారు. మాంసాన్ని అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ చేయడం, వెజ్-నాన్ వెజ్ ఆహార పదార్థాలను ఒకే ఫ్రీజర్లో ఉంచడం, గడువు ముగిసిన సాస్లు నిల్వ చేయడం, అలాగే కొన్ని ఆహార పదార్థాలకు పురుగులు పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, అపరిశుభ్రంగా నిల్వ చేసిన మాంసాన్ని తొలగించారు. పూర్తి స్థాయిలో శుభ్రపరిచే పనులు, శానిటేషన్ నిర్వహించేందుకు రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేశారు. నగరవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు, వంటశాలలు, ఇతర ఆహార సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు కొనసాగుతాయని సీఎంసీ అధికారులు తెలిపారు. ప్రజలు కూడా ఆహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను MyCURE యాప్ ద్వారా లేదా CMC అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేయాలని సూచించారు.