Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి భూకంపం.. భయాందోళనలో స్థానికులు
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో ఆదివారం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. కాగా భూకంపం(Earthquake) 60 కిలోమీటర్ల లోతులో ఉంది.
- Author : Gopichand
Date : 14-05-2023 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో ఆదివారం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. కాగా భూకంపం(Earthquake) 60 కిలోమీటర్ల లోతులో ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆదివారం ఉదయం 8.14 గంటలకు రాజధాని కాబూల్కు కొంత దూరంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మూడు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
భూకంపాల ప్రకంపనలతో ఆఫ్ఘనిస్థాన్ భూమి పదే పదే వణుకుతోంది. భూకంప తీవ్రత 4.3గా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. ఒకదాని తర్వాత ఒకటిగా భూకంపం వస్తుండటంతో స్థానికుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. మార్చి 22న ఆఫ్ఘనిస్థాన్లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించడం గమనార్హం. దీంతో భారీ నష్టం వాటిల్లింది. భూకంపం కారణంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో కనీసం 12 మంది మరణించారు. సుమారు 250 మంది గాయపడ్డారు.
దీని ప్రభావం పాకిస్థాన్లోనూ కనిపించింది
మార్చి 22న వచ్చిన భూకంపం ప్రభావం పాకిస్థాన్లోనూ కనిపించింది. స్థానిక మీడియా ప్రకారం.. పాకిస్తాన్లో భూకంపం కారణంగా 9 మంది మరణించారు. 160 మందికి పైగా గాయపడ్డారు. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, కోహట్ తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
లడఖ్లో 4.3 తీవ్రతతో భూకంపం
మే 9న కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. లేహ్ నగరానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో, 105 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.