US Tariffs: భారతదేశంలో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే రాష్ట్రం ఇదే!
తమిళనాడు నుంచి అమెరికా మార్కెట్కు అత్యధిక ఎగుమతులు జరుగుతాయి కాబట్టి ఈ టారిఫ్లు రాష్ట్రంపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 07:44 PM, Sat - 16 August 25

US Tariffs: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50% టారిఫ్లు (US Tariffs) తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ టారిఫ్ వల్ల రాష్ట్రంలోని లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
టారిఫ్ ప్రభావం.. స్టాలిన్ హెచ్చరిక
తమిళనాడు నుంచి అమెరికా మార్కెట్కు అత్యధిక ఎగుమతులు జరుగుతాయి కాబట్టి ఈ టారిఫ్లు రాష్ట్రంపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. అమెరికా టారిఫ్ను 25% నుండి 50%కి పెంచడం వల్ల రాష్ట్రంలోని టెక్స్టైల్, లెదర్, ఆటో, మెషినరీ వంటి శ్రమ-ప్రధాన రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది దాదాపు 75 లక్షల ఉద్యోగాలను ప్రభావితం చేయవచ్చని, అదనంగా 30 లక్షల ఉద్యోగాలపై తీవ్ర సంక్షోభం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Also Read: Serious Injury Replacement: కొత్త నియమం.. లైక్-ఫర్-లైక్ రీప్లేస్మెంట్ను అమలు చేయనున్న బీసీసీఐ!
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై టారిఫ్ల ప్రభావం
తమిళనాడు మొత్తం ఎగుమతులలో 31% అమెరికాకు వెళ్తుంది. ఇది దేశం మొత్తం ఎగుమతులలో 20% కంటే ఎక్కువ. ముఖ్యంగా భారతదేశ టెక్స్టైల్ ఎగుమతులలో తమిళనాడు వాటా 28%. ఈ కీలక రంగాలపై టారిఫ్లు పెంచడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధిపై భారీ ప్రభావం పడుతుందని స్టాలిన్ తెలిపారు.
కేంద్రం నుండి సహాయం కోసం డిమాండ్
ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం నుండి సమగ్ర రిలీఫ్ ప్యాకేజీని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మానవ నిర్మిత ఫైబర్ విలువ గొలుసులో పన్నుల లోపాన్ని సరిదిద్దడం, పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపు, ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద హామీ లేని రుణాలు, వడ్డీ సబ్సిడీ వంటి చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరారు. అలాగే, రోడ్టెప్ స్కీమ్ లాభాన్ని 5%కి పెంచాలని, బ్రెజిల్ తరహాలో పన్ను మినహాయింపులు, రుణాల వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రధానమంత్రిని అభ్యర్థించారు. త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.