Tamil Nadu BSP Chief : ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్స్ట్రాంగ్(Tamil Nadu BSP Chief) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
- Author : Pasha
Date : 14-07-2024 - 12:18 IST
Published By : Hashtagu Telugu Desk
Tamil Nadu BSP Chief : తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్స్ట్రాంగ్(Tamil Nadu BSP Chief) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కె. తిరువేంగడంను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఓ ప్రాంతంలో అతడు దాచిపెట్టిన ఆయుధాలను గుర్తించేందుకు తిరువేంగడాన్ని నార్త్ చెన్నైలోని ఓ ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు తిరువేంగడం కూరగాయల మార్కెట్లోని ఓ షెడ్లో దాక్కున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అతడు కాల్పులు జరిపాడు. పోలీసులు అప్రమత్తమై జరిపిన ఎదురు కాల్పుల్లో తిరువేంగడంకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
We’re now on WhatsApp. Click to Join
కె.ఆర్మ్స్ట్రాంగ్ను హత్య చేయడానికి ముందు దాదాపు 10 రోజుల పాటు తిరువేంగడం ఫుడ్ డెలివరీ బాయ్ వేషంలో రెక్కీ నిర్వహించాడు. చెన్నై నగరంలోని పెరంబూర్ ఏరియాలో ఉన్న కె.ఆర్మ్స్ట్రాంగ్ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ.. ఆ ఇంటికి ఎవరెవరు, ఏయే టైంలలో వచ్చి వెళ్తున్నారనేది చూశాడు. ప్రత్యేకించి కె.ఆర్మ్స్ట్రాంగ్ రాకపోకల వేళలను తెలుసుకునేందుకు తిరువేంగడం ఈ రెక్కీని నిర్వహించాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. జులై 5న ఆర్మ్స్ట్రాంగ్ను కొందరితో కలిసి హత్య చేశాడు. తిరువేంగడంపై ఇప్పటికే హిస్టరీ షీట్ ఉందని పోలీసులు వెల్లడించారు.
Also Read :Tanikella Bharani : ఇవాళ తనికెళ్ల భరణి బర్త్డే.. ఆయన కెరీర్లోని ఆసక్తికర విశేషాలివీ
ఈ కేసు నిందితులను ఐదు రోజుల క్రితమే పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈక్రమంలో విచారణ కోసం నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా తిరువేంగడం ఎన్కౌంటర్(Tamil Nadu Encounter) చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కేసులో మొత్తం 11 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 1. పొన్నై బాలా, 2. రాము, 3. తిరువేంగడం, 4. తిరుమల, 5. సెల్వరాజ్, 6. మణివణ్ణన్, 7. సంతృప్తి, 8. అరుల్ ఉన్నారు. మరో ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.