Congress : కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం. డిప్యూటీ సీఎం పదవి తన కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా
- Author : Prasad
Date : 29-05-2026 - 5:22 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పిడి నేపథ్యంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య, తన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో తమ వర్గానికి తగిన ప్రాధాన్యం లభించేలా చూడాలన్న ఉద్దేశంతో సిద్దరామయ్య ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని కొనసాగించేందుకు సిద్ధారామయ్య చురుగ్గా పావులు కదుపుతున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సిద్దరామయ్య కాంగ్రెస్ అగ్రనేతలతో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు, రాబోయే రాజ్యసభ ఎన్నికలు తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడితో జరిగిన సమావేశానికి కర్ణాటక మంత్రులు ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, యతీంద్ర సిద్దరామయ్య కూడా హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా సిద్దరామయ్య సమావేశమైయ్యారు. ఇదిలా ఉండగా.. శనివారం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త నాయకుడి ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ఈ సమావేశంలో పూర్తయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను గవర్నర్ కోరారు. పదవి నుంచి వైదొలిగిన అనంతరం స్పందించిన సిద్దరామయ్య, రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించే అవకాశం కల్పించిన కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఉందని, ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.