Shashi Tharoor : బీజేపీలోకి శశిథరూర్ ? మోడీ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
వాస్తవానికి గత రెండేళ్లుగా శశిథరూర్(Shashi Tharoor)కు, కాంగ్రెస్ అగ్రనేతలతో గ్యాప్ పెరిగింది.
- Author : Pasha
Date : 03-05-2025 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
Shashi Tharoor : కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతోందా ? కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బీజేపీలోకి జంప్ కాబోతున్నారా ? ప్రధాని మోడీ శుక్రవారం రోజు చేసిన వ్యాఖ్యలకు అర్థం అదేనా ? అనే కోణంలో ఇప్పుడు చర్చ మొదలైంది. దీనిపై ఓసారి లోతుగా వెళ్దాం..
He shook hand with only one person on stage 🤔 pic.twitter.com/VjSCPHVqVP
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 2, 2025
Also Read :Janulyri : ఆత్మహత్య చేసుకుంటానంటూ జాను కన్నీరు..అసలు ఏంజరిగిందంటే !!
శుక్రవారం రోజు ఏం జరిగింది ?
- ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం రోజు కేరళలో పర్యటించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అదానీ గ్రూపు నడపనున్న విజింజం పోర్టును మోడీ ప్రారంభించారు.
- ఈసందర్భంగా నిర్వహించిన సమావేశ వేదికపై కీలక ఘట్టం జరిగింది. వేదికపై ఉన్న 15 మంది నేతల్లో 14 మందికి ప్రధాని మోడీ సాధారణంగా నమస్కరించారు. కేవలం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్తో మాత్రమే ఆయన కరచాలనం చేశారు. కరచాలనం వేళ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందించారు.
- అనంతరం సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘కేరళ సీఎం పినరయి విజయన్కు నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇండియా కూటమికి బలమైన స్తంభం. కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు మీరు నాతో పాటు వేదిక పంచుకున్నారు. మీరు ఇక్కడ ఉండడం కొందరికి రుచించకపోవచ్చు. వారికి నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుతుంది’’ అని కామెంట్ చేశారు.
మోడీ మాటలకు అర్థం ఏమిటి ?
- దేశంలోని ఏకైక వామపక్ష ప్రభుత్వ అధినేత, కేరళ సీఎం పినరయి విజయన్ తమ కార్యక్రమంలో పాల్గొనడాన్ని కీలకమైన అంశంగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
- కేరళ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఈ కార్యక్రమానికి రావడాన్ని కీలకమైన పరిణామంగా మోడీ అభివర్ణించారు.
- సమావేశ వేదికపై ఉన్న అందరితో కాకుండా.. కేవలం శశిథరూర్తో కరచాలనం చేయడం ద్వారా ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని, ఆయనపై ఉన్న గౌరవాన్ని ప్రధాని మోడీ బహిరంగంగా ప్రదర్శించారు. ఈ కారణం వల్లే శశి థరూర్ బీజేపీకి చేరువయ్యారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
- ఈ వ్యాఖ్యల ద్వారా శశిథరూర్ భుజాల పైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపైకి ప్రధాని మోడీ విమర్శలను ఎక్కుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇండియా కూటమిని సందేహపు వలయంలోకి నెట్టడానికే మోడీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కేరళ బీజేపీకి సారథిగా చేస్తారా ?
గత లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ ఒక సీటు గెల్చుకుంది. అయితే అనూహ్యంగా బీజేపీ 19.24 శాతం ఓట్లను సాధించింది. యూడీఎఫ్ కూటమి 18 సీట్లు, ఎల్డీఎఫ్ కూటమి 1 సీటు గెల్చుకున్నాయి. గత ఎన్నికల సమయంలో కేరళలో బీజేపీకి మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సారథ్యం వహించారు. తిరువనంతపురం లోక్సభ స్థానంలో స్వయంగా రాజీవ్ చంద్రశేఖర్ పోటీచేసినప్పటికీ.. విజయం మాత్రం కాంగ్రెస్ నేత శశిథరూర్నే వరించింది. ఆయన నాలుగోసారి ఎంపీ అయ్యారు. ఈనేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెల్చుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అక్కడ పార్టీని నడిపే బలమైన నేత కోసం కమలదళం పెద్దలు వెతుకుతున్నారు. శశిథరూర్ రూపంలో ఆ నాయకుడు దొరికాడని అంటున్నారు. కేరళలో మతపరమైన రాజకీయాలు అంతగా నడవవు. శశిథరూర్ లాంటి సెక్యులర్ లీడర్ ద్వారా కేరళ ప్రజలకు బీజేపీని చేరువ చేయొచ్చని మోడీ భావిస్తున్నారు.
Also Read :Aadhaar Camps: ఏపీలో ఈనెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు
శశి థరూర్ నిర్ణయం అదేనా ?
వాస్తవానికి గత రెండేళ్లుగా శశిథరూర్(Shashi Tharoor)కు, కాంగ్రెస్ అగ్రనేతలతో గ్యాప్ పెరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్ సర్కారు తీసుకొచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలపై కొద్ది రోజుల క్రితం శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. గత రెండేళ్లలో చాలాసందర్భాల్లో కాంగ్రెస్కు బద్ధ శత్రువైన ప్రధాని మోడీని ప్రశంసిస్తూ థరూర్ ట్వీట్లు చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆలోచన బాగానే ఉందని కితాబిచ్చారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్తో భేటీలపై థరూర్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ గమనించిన కాంగ్రెస్ హైకమాండ్.. శశిథరూర్ను పక్కన పెట్టడం మొదలుపెట్టింది. థరూర్ మనసులో జంపయ్యే ఆలోచన ఉండొచ్చనే అనుమానంతోనే ఆయనకు పార్టీలో ప్రయారిటీ తగ్గించింది. చివరకు కేరళ రాష్ట్ర కాంగ్రెస్లోనూ థరూర్కు ప్రాధాన్యతను తగ్గించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి నా అవసరం లేకపోతే స్పష్టంగా చెప్పాలి. నా దారి నేను చూసుకుంటాను’’ అని గత ఫిబ్రవరిలో పార్టీ అధిష్టానాన్ని థరూర్ బహిరంగంగా అడిగారు. ఈ నేపథ్యంలో థరూర్ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.