NEET: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం
- Author : Vamsi Chowdary Korata
Date : 23-05-2026 - 10:29 IST
Published By : Hashtagu Telugu Desk
రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు వాపసు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ద్వారా సమర్పించి, రిఫండ్ పొందవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కాగా, 27లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు నమోదు చేసిన బ్యాంకు ఖాతాకు ఫీజు నేరుగా బదిలీ చేయబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది.
బ్యాంకు వివరాలు సమర్పించే విధానం:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.
- హోమ్పేజీలో కనిపించే “NEET 2026 Refund Portal” లింక్పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- తరువాత బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు పేరు వంటి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
- అవసరమైతే రద్దు చేసిన చెక్కు (cancelled cheque) కాపీని అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలు సరిచూసుకుని, రిఫండ్ రిక్వెస్ట్ ఫారమ్ను సబ్మిట్ చేయాలి.
- చివరగా భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
సాంకేతిక సమస్యలు, ఎన్టీఏ సూచనలు
ప్రస్తుతం ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు పోర్టల్ను యాక్సెస్ చేస్తుండటంతో సర్వర్పై అధిక భారం పడి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లాగిన్ ఎర్రర్లు, ఓటీపీ ఆలస్యం కావడం, సర్వర్ డౌన్ అవ్వడం వంటి సమస్యలను చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్డేటెడ్ బ్రౌజర్ను ఉపయోగించాలని, రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో ప్రయత్నించాలని ఎన్టీఏ సూచించింది. అలాగే, నకిలీ రీఫండ్ సందేశాలు లేదా ఫేక్ పోర్టల్స్ను నమ్మవద్దని, కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని హెచ్చరించింది.
కాగా, నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ను జూన్ 21న నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.