Vijayashanti : ఎమ్మెల్సీ రేసులో విజయశాంతి ..!
విజయశాంతి పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాతా పార్టీకి ఆమె అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తరుచు ట్వీట్టర్ ద్వారా పార్టీ.. ప్రభుత్వ విధానాలపైన స్పందించడం.. ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు.
- By Latha Suma Published Date - 08:25 PM, Thu - 6 March 25

Vijayashanti : కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత అజ్ఞాతంలో ఉన్న విజయశాంతి.. ఒక్క సారిగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ పెద్దలను ఆమె కలుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ నడుస్తుంది. విజయశాంతి పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాతా పార్టీకి ఆమె అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తరుచు ట్వీట్టర్ ద్వారా పార్టీ.. ప్రభుత్వ విధానాలపైన స్పందించడం.. ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు.
Read Also: Whatapp Governance: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 200 సేవలు!
ఇక, ఆకస్మాత్తుగా ఎమ్మెల్యే కోటా ఎన్నికల రేసులోకి రావడం పార్టీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. విజయ శాంతి ఢిల్లీలో తనకు తెలిసిన కాంగ్రెస్ అగ్రనేతల ద్వారా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. గత కొన్నాళ్లుగా రాములమ్మ సైలెంట్గా ఉండడంతో ఆమె పార్టీ మారుతున్నారని ప్రచారం కూడా జరిగింది. మళ్లీ బీజేపీలో చేరే అవకాశం ఉందన రూమర్లు పుట్టించారు. అయితే సడెన్గా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విజయశాంతి ఢిల్లీలో ప్రత్యక్షం కావడం.. కాంగ్రెస్ పెద్దలను కలవడం హాట్ టాపిక్గా మారింది. రాములమ్మ సీఎం రేవంత్రెడ్డిని కలవకుండానే నేరుగా కాంగ్రెస్ హై కమాండ్ నేతలతోనే భేటీ కావడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.
అంతేకాక..కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీగా మీనాక్షి నటరాజన్ రాకతో పరిస్థితిలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. గాంధీభవన్లో విజయశాంతి గురించి ఆమె ఆరా తీసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉన్న విజయశాంతి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..? వంటి వివరాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు. సీనియర్ నేతల సేవలను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఫీడ్బ్యాక్ రావడంతో మీనాక్షి నటరాజన్ కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ఇకపోతే..విజయశాంతి రాజకీయంగా యాక్టివ్ అయిన తర్వాత సినిమాల్లో నటించడం లేదు. మొదటగా తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టిన ఆమె తర్వాత చాలా పార్టీలు మారారు. బీజేపీ నుండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓ సారి విజయం సాధించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. ఆ ప్రకారం తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Also: Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం