Marriage For Buffaloes : గేదెల కోసం మహిళ రెండో పెళ్లి.. షాకిచ్చిన అత్తామామలు
పెళ్లి జరిగిన తర్వాత వచ్చే రూ.35వేలను తాను తీసుకుంటానని ముందే జాబర్కు(Marriage For Buffaloes) చెప్పింది.
- Author : Pasha
Date : 24-02-2025 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
Marriage For Buffaloes : ఆమె బరి తెగించింది. ఇప్పటికే ఉన్న భర్తకు విడాకులు ఇవ్వకుండానే, మరో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న సదరు మహిళ, ఎందుకు మరో పెళ్లి చేసుకోవాలని భావించిందో తెలిస్తే మీరు ముక్కున వేలు వేసుకుంటారు.
అస్మా అనే మహిళకు మూడేళ్ల క్రితమే పెళ్లయింది. ఆమె భర్త పేరు నూర్ మొహమ్మద్. అయితే గొడవల కారణంగా భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కోర్టును అస్మా ఆశ్రయించింది. ఈ విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్ దశలో ఉంది. విడాకులు మంజూరు కానిదే, మరో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. అయినా సదరు మహిళ తన బంధువు జాబర్ అహ్మద్ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక స్కీం ద్వారా నిరుపేద వధూవరులకు సామూహికంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ స్కీంకు అప్లై చేసి, పెళ్లి చేసుకుంటే రూ.35వేలు ఇస్తారు. ఈ డబ్బుల కోసం అస్మా ఆశపడింది. జాబర్ అహ్మద్తో మాట్లాడి, తనతో పెళ్లి చేసుకునేందుకు ఒప్పించింది. పెళ్లి జరిగిన తర్వాత వచ్చే రూ.35వేలను తాను తీసుకుంటానని ముందే జాబర్కు(Marriage For Buffaloes) చెప్పింది. ఆ డబ్బుతో గేదెలు, రెండు జతల బట్టలు, గోడ గడియారం, వెండి ఉంగరాలు కొంటానని తెలిపింది.
Also Read :Lizard Venom VS Diabetes : షుగర్ ఔషధాలకు విషపూరిత బల్లులతో లింక్.. ఏమిటి ?
అత్తమామల ఎంట్రీతో..
ఉత్తరప్రదేశ్లోని హసన్పూర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 300 జంటలకు సామూహిక వివాహాలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ జంటల్లో అస్మా, జాబర్ అహ్మద్ కూడా ఉన్నారు. కాసేపైతే పెళ్లి జరుగుతుంది.. అనే తరుణంలో అక్కడికి అస్మా అత్తమామలు పోలీసులతో చేరుకున్నారు. వారిని చూసి అస్మా నీళ్లు నమిలింది. అస్మా, జాబర్ అహ్మద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి, ఆర్థిక ప్రయోజనం పొందాలని అస్మా భావించిందని పోలీసులు వెల్లడించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.