యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడిన ప్రధాని మోదీ!
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. హోర్ముజ్ మార్గం మూతపడితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా.
- Author : Gopichand
Date : 24-03-2026 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
Trump- PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధం గురించి చర్చించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటం, ప్రపంచ ఇంధన సరఫరా భద్రతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల అధినేతల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ స్వయంగా ‘X’ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. అమెరికా అధ్యక్షుడి నుండి ఫోన్ వచ్చిందని, తాము ప్రస్తుత పరిస్థితులపై చర్చించామని తెలిపారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ఉద్రిక్తతలను తగ్గించడానికి, వీలైనంత త్వరగా శాంతిని నెలకొల్పడానికి భారత్ మద్దతు ఇస్తుంది. హోర్ముజ్ జలసంధి తెరిచి ఉండటం, సురక్షితంగా ఉండటం ప్రపంచం మొత్తానికి చాలా ముఖ్యం. శాంతి స్థాపన కోసం నిరంతరం సంప్రదింపులు జరపాలని మేము నిర్ణయించుకున్నాం” అని పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిపై చర్చ
అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ.. “అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే ప్రధానమంత్రి మోదీతో మాట్లాడారు. వారు మిడిల్ ఈస్ట్ ప్రస్తుత పరిస్థితిపై, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రాముఖ్యతపై చర్చించారు” అని తెలిపారు. అంతకుముందు పర్షియా గల్ఫ్, ఓమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఈ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్కు ఇచ్చిన గడువును పొడిగిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అలాగే ఇరాన్ ఇంధన కేంద్రాలపై జరగాల్సిన దాడులను మరో ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!
చమురు సంక్షోభంపై మార్కో రూబియోతో జైశంకర్ చర్చ
దీనికంటే ముందు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం (మార్చి 23, 2026) అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ ఆసియా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం, ఇంధన భద్రత గురించి వారు చర్చించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆందోళనల గురించి జైశంకర్ సోషల్ మీడియా ద్వారా వివరించారు.
గల్ఫ్ దేశాల రాయబారులతో భేటీ
వాషింగ్టన్లోని అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ చర్చలను ధృవీకరించింది. ఇదే క్రమంలో జైశంకర్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ రాయబారులతో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిస్థితులు, భారత ఇంధన భద్రతపై నెలకొన్న ఆందోళనల గురించి వారితో చర్చించారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు అందిస్తున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరల పెరుగుదల
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. హోర్ముజ్ మార్గం మూతపడితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా. జైశంకర్ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్, జర్మనీ విదేశాంగ మంత్రితో కూడా ఈ సంక్షోభం గురించి చర్చించారు. ప్రాంతీయ శాంతి, ఇంధన భద్రత కోసం అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని భారత్ పునరుద్ఘాటించింది.