Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాలని అమిత్ షాకు లేఖ!
కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో దేశం 'దహలీజ్' (ప్రవేశ ద్వారం) అని పిలిచేవారని, దీనిని ప్రజలు 'దేహ్లీ' అని పిలిచేవారని భావిస్తున్నారు. ఈ పదమే క్రమంగా ఢిల్లీగా రూపాంతరం చెందింది.
- By Gopichand Published Date - 06:29 PM, Sat - 1 November 25
Rename Delhi: ఢిల్లీలోని చాందినీ చౌక్ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ ఢిల్లీ (Rename Delhi) పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, ఢిల్లీ విమానాశ్రయం (ఎయిర్పోర్ట్) పేరును ‘ఇంద్రప్రస్థ అంతర్జాతీయ విమానాశ్రయంగా’ మార్చాలని కూడా బీజేపీ ఎంపీ అమిత్ షాకు సూచించారు.
ఖండేవాల్ లేఖలో ఏముందంటే?
భారతదేశపు ప్రాచీన సాంస్కృతిక వారసత్వాలలో ఢిల్లీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక మహానగరం మాత్రమే కాదు. భారతీయ నాగరికత ఆత్మ, ధర్మం, నీతి, లోకకళ్యాణం సంప్రదాయాలకు కేంద్రంగా ఉంది అని రాసుకొచ్చారు. తరువాత మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ.. ఢిల్లీ చరిత్ర నేరుగా పాండవుల కాలంతో ముడిపడి ఉందని, అందుకే మన ఢిల్లీ గౌరవప్రదమైన సంస్కృతి, నాగరికత, వారసత్వం, సంప్రదాయాలు ‘ఇంద్రప్రస్థ’ పేరుతో ముడిపడి ఉన్నాయని అన్నారు.
పాండవుల విగ్రహాల ఏర్పాటుకు డిమాండ్
“పాండవులు యమునా నది ఒడ్డున ఇంద్రప్రస్థ రాజధానిని స్థాపించారు” అని ఖండేవాల్ గుర్తు చేశారు. ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలలో పాండవుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. దీని ద్వారా యువ తరానికి పాండవుల సంస్కృతి, నాగరికత గురించి తెలుస్తుందని ఆయన అన్నారు.
నగరం చారిత్రక ప్రాముఖ్యతను హోంమంత్రికి వివరిస్తూ ఖండేవాల్.. “మహాభారత కాలంలో పాండవులు ఇక్కడే యమునా తీరాన తమ రాజధాని ఇంద్రప్రస్థను స్థాపించారు. మౌర్య కాలం నుండి గుప్తుల కాలం వరకు ఇంద్రప్రస్థ వాణిజ్యం, సంస్కృతి, పరిపాలనకు ప్రధాన కేంద్రంగా ఉండేది. 11వ-12వ శతాబ్దంలో రాజపుత్రుల కాలంలో తోమర్ రాజులు దీనిని ‘డిల్లికా’ అని పిలిచేవారు. దీని నుంచే ‘ఢిల్లీ’ అనే పేరు ఉద్భవించింది” అని లేఖలో పేర్కొన్నారు.
Also Read: Toyota: మార్కెట్లోకి 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్న టయోటా!
ఇంగ్లీష్లో ‘Delhi’ అక్షరంపై అభ్యంతరం
నాలుగు రోజుల క్రితం అక్టోబర్ 28న మాజీ కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా ఒక పత్రికా సమావేశంలో ఢిల్లీ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంగ్లంలో ‘Delhi’ అని రాసినా.. దేశం మొత్తం దీనిని ‘దిల్లీ’ అని పలుకుతుందని అన్నారు. ఉచ్చారణ, గుర్తింపు రెండింటి గౌరవార్థం ఇప్పుడు ఆంగ్లంలో కూడా దీనిని ‘Dilli’ గా రాయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
నవంబర్ 1న ఢిల్లీ ప్రభుత్వం కొత్త అధికారిక లోగోను విడుదల చేసినప్పుడు అందులో ‘Delhi’ బదులు ‘Dilli’ అని రాయాలని గోయల్ కోరారు. “ఇది కేవలం పేరు మార్చడం కాదు ఇది మన ఆత్మ, సంప్రదాయం, చరిత్రతో ముడిపడి ఉన్న ఒక ముందడుగు” అని ఆయన అన్నారు.
ఢిల్లీ పేరు ఎలా వచ్చింది?
- ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని ఇంద్రప్రస్థ అని పిలిచేవారు. మహాభారత కాలంలో కౌరవులు, పాండవులు హస్తినాపురాన్ని పంచుకునేటప్పుడు శకుని సలహా మేరకు ధృతరాష్ట్రుడు పాండవులకు భయంకరమైన అడవి అయిన ఖాండవప్రస్థం ఇచ్చారు. ఇదే నేటి ఢిల్లీ ప్రాంతం. పాండవులు ఈ ఖాండవప్రస్థాన్ని రాజధానిగా అభివృద్ధి చేసి.. దానికి ఇంద్రప్రస్థ అని పేరు పెట్టారు.
- తోమర్ వంశానికి చెందిన రాజు పాలనలో రాజ్యంలో పాతిపెట్టిన ఒక భారీ మేకు (ఇనుప స్తంభం) రాజ్యాన్ని రక్షిస్తుందని ఒక రుషి చెప్పినట్లు ఒక కథ ఉంది. రాజు ఉత్సుకతతో దానిని తీయించాడు. కానీ మళ్లీ పాతిపెట్టినప్పుడు అది వదులై (ఢీలీ) ఉండిపోయింది. ఈ ‘ఢీలీ కీల్’ నుంచే ‘ఢీలీ’ అనే పదం వచ్చి తర్వాత ‘దిల్లీ’ గా మారింది.
- తోమర్ వంశం పాలనలో జారీ చేయబడిన నాణేలను ‘దేహలీవాల్’ అని పిలిచేవారు. ఈ పదం క్రమంగా ‘ఢిల్లీ’గా మారిందని మరొక నమ్మకం.
- కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో దేశం ‘దహలీజ్’ (ప్రవేశ ద్వారం) అని పిలిచేవారని, దీనిని ప్రజలు ‘దేహ్లీ’ అని పిలిచేవారని భావిస్తున్నారు. ఈ పదమే క్రమంగా ఢిల్లీగా రూపాంతరం చెందింది.
చారిత్రక గుర్తింపు
- 1911లో బ్రిటిష్ పాలనలో ఢిల్లీని రాజధానిగా ప్రకటించారు.
- 1931 ఫిబ్రవరి 13న దీనిని అధికారికంగా భారతదేశ రాజధానిగా ప్రకటించారు.
- అంతకుముందు కలకత్తా (ప్రస్తుతం కోల్కతా) దేశ రాజధానిగా ఉండేది. స్వాతంత్య్రం తరువాత కూడా ఢిల్లీనే జాతీయ రాజధానిగా కొనసాగుతోంది. నేటికీ దీనిని “దేశ్ కా దిల్” (దేశ హృదయం) అని పిలుస్తారు.