Toyota: మార్కెట్లోకి 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్న టయోటా!
టయోటా భారతదేశంలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడిలో భాగంగా కంపెనీ రెండు పెద్ద ప్రాజెక్టులపై పని ప్రారంభించింది.
- By Gopichand Published Date - 04:30 PM, Sat - 1 November 25
Toyota: జపాన్ ఆటోమొబైల్ కంపెనీ టయోటా (Toyota) భారతీయ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం దేశంలో కంపెనీకి దాదాపు 8 శాతం మార్కెట్ వాటా ఉంది. దీనిని 2030 నాటికి 10 శాతం వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ వచ్చే ఐదేళ్లలో 15 కొత్త లేదా అప్డేట్ చేసిన వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనాల్లో రెండు కొత్త ఎస్యూవీలు (SUV), ఒక సరసమైన పిక్అప్ ట్రక్ కూడా ఉన్నాయి.
15 కొత్త మోడల్స్తో పోర్ట్ఫోలియో విస్తరణ
2030 నాటికి మొత్తం 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు టయోటా తెలిపింది. వీటిలో కొన్ని పూర్తిగా కొత్త వాహనాలు కాగా కొన్ని ఇప్పటికే ఉన్న మోడళ్ల అప్డేట్ చేసిన వెర్షన్లు ఉంటాయి. ప్రస్తుతం మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్న ఎస్యూవీ, పిక్అప్ సెగ్మెంట్లపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించనుంది.
టయోటా కొత్త ఎస్యూవీలలో ఒకటి ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జే (Land Cruiser FJ) కానుంది. ఇది 2025లో జపాన్ మొబిలిటీ షోలో ప్రపంచవ్యాప్తంగా పరిచయం కానుంది. రెండవ ఎస్యూవీ మోడల్ ఇప్పటికే ఇండోనేషియా, థాయిలాండ్లలో అమ్ముడవుతున్న హైలక్స్ ఛాంప్ (Hilux Champ) ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు గ్రామీణ, చిన్న పట్టణ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతున్న ఒక సరసమైన పిక్అప్ ట్రక్ను కూడా కంపెనీ విడుదల చేయనుంది.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ ఎలా ఫిట్గా అయ్యాడో తెలుసా?
3 బిలియన్ డాలర్ల పెట్టుబడి, కొత్త ఫ్యాక్టరీలు
టయోటా భారతదేశంలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడిలో భాగంగా కంపెనీ రెండు పెద్ద ప్రాజెక్టులపై పని ప్రారంభించింది. కర్ణాటకలోని బిదాదిలో ఇప్పటికే ఉన్న ప్లాంట్ను విస్తరిస్తున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో ఒక కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయితే టయోటా ఉత్పత్తి సామర్థ్యం 1 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువగా మారుతుంది.
గ్రామీణ, చిన్న పట్టణాలలో ఉనికి పెంపు
టయోటా ఇప్పుడు గ్రామీణ, చిన్న పట్టణాల కస్టమర్లను చేరుకోవడానికి కూడా పెద్ద అడుగులు వేస్తోంది. దీని కోసం కంపెనీ చిన్న పరిమాణంలో తక్కువ ఖర్చుతో కూడిన షోరూమ్లు, కాంపాక్ట్ సర్వీస్ వర్క్షాప్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ షోరూమ్లలో పరిమిత సంఖ్యలో డిస్ప్లే కార్లు ఉంటాయి. తద్వారా ఖర్చును తగ్గించి ఎక్కువ మంది కస్టమర్లకు బ్రాండ్ను చేరువ చేయవచ్చు.
గత ఆర్థిక సంవత్సరంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇప్పటివరకు అత్యధికంగా $640 మిలియన్లు (దాదాపు రూ. 5,350 కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ విజయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి . హైబ్రిడ్ మోడళ్ల పెరుగుతున్న ప్రజాదరణ, సుజుకి-ఆధారిత మోడళ్ల బలమైన అమ్మకాలు. 2024లో టయోటా మొత్తం అమ్మకాలలో సుజుకి ప్లాట్ఫారమ్పై తయారైన కార్ల వాటా 52% కి చేరుకుంది. అంతేకాకుండా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder), ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) వంటి బలమైన హైబ్రిడ్ మోడళ్లు ప్రత్యామ్నాయ ఇంధన విభాగంలో కంపెనీ పట్టును మరింత బలోపేతం చేశాయి.